కరోనా సెకండ్ వేవ్ ఇంకా పోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2021-08-03T23:52:52+05:30 IST

దేశంలో ఇప్పటికీ ప్రతిరోజు 30 వేల పైచిలుకు కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సూచించింది.

కరోనా సెకండ్ వేవ్ ఇంకా పోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికీ ప్రతిరోజు 30 వేల పైచిలుకు కొత్త కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా సూచించింది. ‘‘ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే దేశంలో సెకండ్ వేవ్ ఇంకా పోలేదు. ఇక్కడ ఆర్-ఫ్యాక్టర్ సంఖ్య 1.2గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ వాల్యూ పెరుగుతోంది’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ సోమవారం నాడు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఆర్-ఫ్యాక్టర్ 1 మార్కు దాటిందని పేర్కొన్నారు. అలాగే బెంగాల్, నాగాల్యాండ్, హరియాణా, గోవా, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆర్-ఫ్యాక్టర్ ఒకటిగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో మాత్రమే ఆర్-ఫ్యాక్టర్ తగ్గుతోందని చెప్పారు.


దేశంలో మొత్తం 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కేరళలోని పది జిల్లాలు, మహారాష్ట్రలో మూడు, మణిపూర్‌లో రెండు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, మిజోరాం రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం రోజువారీ కేసుల్లో 47 శాతం ఈ జిల్లాల్లోనే వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. అయితే..కేసుల పెరుగుదల దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన విషయాన్ని కూడా లవ్ అగర్వాల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

Updated Date - 2021-08-03T23:52:52+05:30 IST