సెకండ్ డోస్ టెన్షన్
ABN , First Publish Date - 2021-04-23T05:22:35+05:30 IST
జిల్లాలో మొదటి విడత వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజానీకం గురువారం సెకండ్ డోసు వేయించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. వారం నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో మొదటి డోసు వేయించుకొని ఇప్పటికే నెలరోజులు దాటిన వారు ఆయా కేంద్రాల వద్దకు ఉదయం ఏడు గంటలకే బారులు తీరారు. ప్రభుత్వం ప్రతి గురువారం సెకండ్ డోసు టీకా వేస్తామని ప్రకటించడంతో జనం భారీగా వచ్చారు
టీకా వేయించుకునేందుకు కేంద్రాలకు భారీగా రాక
ఒంగోలులో ప్రతికేంద్రం వద్ద కిటకిట
ఒంగోలు(కలెక్టరేట్), ఏప్రిల్ 22 : జిల్లాలో మొదటి విడత వ్యాక్సిన్ వేయించుకున్న ప్రజానీకం గురువారం సెకండ్ డోసు వేయించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. వారం నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో మొదటి డోసు వేయించుకొని ఇప్పటికే నెలరోజులు దాటిన వారు ఆయా కేంద్రాల వద్దకు ఉదయం ఏడు గంటలకే బారులు తీరారు. ప్రభుత్వం ప్రతి గురువారం సెకండ్ డోసు టీకా వేస్తామని ప్రకటించడంతో జనం భారీగా వచ్చారు. దీంతో కేంద్రాలు కిటకిటలాడాయి. కొంతమంది టీకా వేయించుకునేందుకు, ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు ఎండలో మాస్కులు తీసి నిలబడ్డారు.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన
తొలి డోసును ప్రశాంత వాతావరణంలో వేయించుకున్న ప్రజానీకం సెకండ్ డోసు విషయానికి వచ్చేసరికి ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాక్సిన్ కొరత కారణంగా గత వారంరోజుల నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్ కొనసాగని పరిస్థితి. రెండురోజుల పాటు ఫ్రంట్లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్ వేయగా గురువారం సెకండ్ డోసు వేస్తామని ప్రకటించడంతో ప్రజానీకం కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఉదయం నుంచే క్యూకట్టారు. దీంతో కనీసం ఆయా కేంద్రాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించిన పరిస్థితి కనిపించలేదు.