ఇద్దరిదీ రెండో పెళ్లి.. 11 నెలల కుమార్తెకు పుట్టెంట్రుకలు తీసేందుకు గుడికెళ్లి.. తిరిగొచ్చిన కొన్ని నిమిషాల్లోనే..!
ABN , First Publish Date - 2021-11-03T16:52:07+05:30 IST
ఇద్దరిదీ రెండో వివాహం. 11 నెలల కుమార్తె కూడా ఉంది. పెళ్లైన..
హైదరాబాద్ సిటీ/రాంనగర్ : అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు సంబంధించి ముషీరాబాద్ పీఎస్ సీఐ జహంగీర్ తెలిపిన వివరాలు.. జనగామ జిల్లా ఎల్లంల గ్రామానికి చెందిన వాసంతి (27) రాంనగర్లోని టీఆర్టీ కాలనీకి చెందిన ధన్రాజ్ (31)తో 2019లో వివాహం జరిగింది. ఇద్దరిదీ రెండో వివాహం. 11 నెలల కుమార్తె కూడా ఉంది. పెళ్లైన నాటి నుంచి భర్త ధన్రాజ్ అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్నాడు. మామ కూడా ఆమెను వివిధ కారణాలతో ఇబ్బందులు పెట్టేవాడు. కుమార్తె పుట్టు వెంట్రుకలు తీసేందుకు వాసంతి తల్లిదండ్రులు, తమ్ముడు కిషన్ ధన్రాజ్, వాసంతి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీశైలంలో వెళ్లివచ్చారు.
సోమవారం రాత్రి వాసంతి తల్లిదండ్రులు, సోదరుడు స్వగ్రామానికి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 11 గంటలకు భర్త ధన్రాజ్ వాసంతి తల్లిదండ్రులకు ఫోన్చేసి వాసంతి ఉరేసుకుందని సమాచారం ఇచ్చాడు. వారు రాంనగర్కు వచ్చేసరికి ధన్రాజ్ ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించాడు. ముషీరాబాద్ ఎస్ఐ శ్రీనివాస్, క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్త ధన్రాజ్, మామ పాండును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాసంతిది ఆత్మహత్యా? భర్తే హత్యచేసి ఆత్మహత్యగా సృష్టించాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
భర్తే హత్య చేశాడు: తల్లిదండ్రులు
తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, భర్త ధన్రాజ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వరలక్ష్మి, ప్రభాకర్ ఆరోపించారు. పెళ్లైన నాటి నుంచి తమ కుమార్తెను అదనపు కట్నం, ఇతర కారణాలతో అత్తింటివారు వేధింపులకు గురిచేసేవారని ఆరోపించారు. తమ కుమార్తె మరణానికి అత్తింటి వేధింపులే కారణమన్నారు.