ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం!
ABN , First Publish Date - 2022-06-29T08:51:37+05:30 IST
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని ఈటల రాజేందర్ భూముల వ్యవహారం తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
- అధికారులతో కలెక్టర్ చర్చలు
- తూప్రాన్లో రాత్రంతా అధికారులు బిజీబిజీ
- వారితో అధికార పార్టీ నాయకుడు కూడా..
తూప్రాన్, జూన్ 28: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని ఈటల రాజేందర్ భూముల వ్యవహారం తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయమే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల భూముల వద్ద పోలీసులను మోహరించనున్నట్లు తెలిసింది. ఈటల భూముల పంపిణీ వ్యవహారంపై మూడు రోజులుగా కలెక్టర్ హరీశ్తో కలిసి తహసీల్దారు కార్యాలయ అధికారులు పనులు చక్కబెడుతున్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ రమేష్ తూప్రాన్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చా రు. తూప్రాన్ ఆర్డీవో, డిప్యూటీ సర్వేయర్, మాసాయిపేట తహసీల్దారు, ఇతర సిబ్బంది రాత్రి 10 గంటల వరకు బిజీబిజీగా గడిపారు. అధికారులు రాత్రి తూప్రాన్ ప్రాంతంలోనే బస చేస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి కూడా ఆర్డీవో కార్యాలయంలో ఉండడం గమనార్హం. కాగా... నేడో, రేపో రైతులకు భూ పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు అవసరమైన పత్రాలను తయారుచేస్తున్నట్లు తెలిసింది. రైతులకు తిరిగి పట్టాలు అందజేసేందుకు బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. కబ్జా జరిగినట్టు తేల్చిన భూముల్లో 51 మంది రైతులకు సబ్డివిజన్ (హద్దులు) కూడా చేసినట్లు తెలిసింది.