Secunderabad రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయ్.. విమానాశ్రయం రేంజ్లో.. !
ABN , First Publish Date - 2021-09-09T17:36:23+05:30 IST
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ..
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపు రేఖలు మారనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. బెంగళూరు, చంఢీగడ్ రైల్వే స్టేషన్లను ‘రైల్ ఆర్కేడ్’లుగా తీర్చిదిద్దేందుకు టెండర్లు ఆహ్వానించిన ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ త్వరలో సికింద్రాబాద్ స్టేషన్కు సంబంధించి కూడా టెండర్ ప్రక్రియకు కసరత్తు చేస్తోంది. దశల వారీగా దేశంలోని 90కి పైగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసే బాధ్యతలను కార్పొరేషన్కు అప్పగించారు. ఈ జాబితాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఉండడంతో కొవిడ్కు ముందు ఈ స్టేషన్ను ఐఆర్ఎస్డీసీకి అప్పగించారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లోని పార్కింగ్, స్టాల్స్, టాయ్లెట్ల నిర్వహణ, పారిశుధ్య పనులు తదితర పనులను ఐఆర్ఎస్డీసీ పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టేషన్ అభివృద్ధి ప్రక్రియను ముమ్మరం చేశారు. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలు, సదుపాయాలు తదితర అంశాలతో డిజైన్ను ఇప్పటికే సిద్ధం చేయగా, వీటిని కార్పొరేట్ కార్యాలయానికి పంపించనున్నారు.
ఉన్నతాధికారుల అనుమతితో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న స్టేషన్ భవనాలను, నిర్మాణాలను కొనసాగిస్తూనే నూ తన నిర్మాణాలు చేపట్టనున్నారు. విమానాశ్రయాల్లో మాదిరిగా ప్రయాణికులకు సదుపాయాలు కల్పించనున్నారు. ప్రయాణికులకు మ్యాగజైన్లు, పుస్తకాలు, హ్యాండ్లూమ్స్, సై బర్ కేఫేలు, స్టార్ హోటళ్లు, ఔషధాలు, తదితర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పార్కింగ్ సమస్య లే కుండా చేయనున్నారు.