అలల ఉధృతికి ఇద్దరు విద్యార్థుల గల్లంతు
ABN , First Publish Date - 2021-12-05T15:54:00+05:30 IST
తరగంబాడి సముద్రతీరంలో స్నేహితులతో కలసి సరదాగా స్నానం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు అలల ఉధృతికి గల్లంతు కాగా, కోస్ట్గార్డ్ పోలీసులు జాలర్ల సాయంతో వారి కోసం గాలిస్తున్నారు. మైలాడుదురై జిల్లా
పెరంబూర్(చెన్నై): తరగంబాడి సముద్రతీరంలో స్నేహితులతో కలసి సరదాగా స్నానం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు అలల ఉధృతికి గల్లంతు కాగా, కోస్ట్గార్డ్ పోలీసులు జాలర్ల సాయంతో వారి కోసం గాలిస్తున్నారు. మైలాడుదురై జిల్లా తరంగంబాడి డేనిష్ కోట సమీపంలోని సముద్రతీరంలో కొందరు కళాశాల విద్యార్థులు స్నానం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సముద్రపు అలలు అధికంగా ఉన్నాయని, స్నానాలకు వెళ్లరాదని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా విద్యార్థులు సముద్రంలో దిగారు. ఆ సమయంలో ఉధృతంగా వీచిన అలల దాటికి ఐటీఐ విద్యార్థి శివశక్తి (18), ఆర్ట్స్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఆనందరాజ్లు కొట్టుకుపోయారు. సహచర విద్యార్థులు పెట్టిన కేకలకు అక్కడకు చేరుకున్న పోలీసులు, పడవల్లో జాలర్ల సాయంతో గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.