విత్తనం విరగపండింది..
ABN , First Publish Date - 2021-10-25T05:15:32+05:30 IST
దాళ్వా విత్తనసాగు ఈ ఏడాది విరగ పండింది.
3,900 ఎకరాల్లో దాళ్వా విత్తన సాగు
45 వేల క్వింటాళ్ల దిగుబడి అవకాశం
గతం కంటే ఈ ఏడాది తక్కువే
దాళ్వాకు 85 వేల క్వింటాళ్లు అవసరం
భీమవరం రూరల్, అక్టోబరు 24 : దాళ్వా విత్తనసాగు ఈ ఏడాది విరగ పండింది. జిల్లాలో 3,900 ఎకరాల్లో విత్తన సాగు చేశారు. సుమారు 45 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ దాళ్వా సాగుకు 85 వేల క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉంటుందని వ్యవసాయాధికారుల లెక్క. గతంలో 50 వేల క్వింటాళ్లకు పైగా రైతులు పండించిన విత్తనాలే ఉండేవి. మిగిలినవి ఏపీ సీడ్స్, సొసైటీలు, వ్యవసాయశాఖ అందించేవి. ఈసారి రైతు విత్తనం తగ్గే అవకాశం ఉన్నందున విత్తనాలకు డిమాండ్ పెరిగేలా కనిపిస్తున్నది. దీంతో విత్తనం ధరలు పెరుగుతాయని రైతులు అంచనా వేస్తునారు.
మరో వారం రోజుల్లో విత్తన మాసూళ్లు మొదలవుతాయని రైతులు అంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే విత్తన సాగు గట్టెక్కుతుంది. దిగుబడిని బట్టి రైతులు విత్తన ధరలు నిర్ణయిస్తారు. గతేడాది విత్తనం బస్తా (75 కేజీలు) రూ.2300 వరకు అమ్మారు. ఈసారి ధర పెరుగుతుందో లేక అంతే ఉంటుందో చూడాలి. రైతులు విత్తనాల కోసం ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.