70 లీటర్ల సారా స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-29T07:09:42+05:30 IST
సారా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 70లీటర్ల సారా, 1200 కేజీల బెల్లాన్ని శనివారం పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
- సారా తయారీ స్థావరంలోనే ముగ్గురి అరెస్టు
- వైసీపీ నేత రామలింగారెడ్డిపై కేసు నమోదు
- 1200 కేజీల బెల్లం స్వాధీనం
వెదురుకుప్పం, మే 28: సారా స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 70లీటర్ల సారా, 1200 కేజీల బెల్లాన్ని శనివారం పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరిలో వైసీపీ నేత ఒకరు ఉన్నారు. వెదురు కుప్పం పోలీసు సబ్ఇన్స్పెక్టర్ గోపి తెలిపిన వివరాల మేరకు... వెదురుకుప్పం మండలం వేణుగోపాలపురం గ్రామ సమీపంలో పాతచెరువు వంక వద్ద సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో దాడి చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో పాతచెరువు వంక వద్ద వేణుగోపాలపురం దళితవాడకు చెందిన వాసు, రాజీవ్గాంధీ అలియాస్ రాజా, భాస్కర్ సారా తయారీ చేస్తుండగా అరెస్టు చేసి 70 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1200 కేజీల బెల్లంను సీజ్ చేశామని చెప్పారు. పట్టుబడిన ముగ్గురిని విచారించగా వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీ చెంచుగుడికి చెందిన రామలింగారెడ్డి పేరును వెల్లడించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. వీరికి అతడు నల్లబెల్లం విక్రయిస్తున్నట్లు తెలిపారు.