278 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-10-27T07:10:38+05:30 IST
మఠంపల్లి మండలం అల్లీపురం గ్రామంలో రూ.10 లక్షల విలువచేసే 28 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
నలుగురిపై కేసు నమోదు
ఇద్దరి అరెస్టు, 30 టన్నుల బియ్యం స్వాధీనం
హుజూర్నగర్ , అక్టోబరు 26: మఠంపల్లి మండలం అల్లీపురం గ్రామంలో రూ.10 లక్షల విలువచేసే 28 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరి అరెస్టు చేశారు. మిల్లర్లపై పీడీ యాక్డు నమోదు చేశారు. హుజూర్నగర్లోని సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరా ప్రకారం.. అల్లీపురం గ్రామంలో కొమ్మనబోయిన లక్ష్మీనారాయణ తన భార్య రాధిక పేరిట రైస్ మిల్లు ఏర్పాటు చేసి ఆమె పేరిట నడుపుతున్నాడు. లక్ష్మీనారాయణ, గుండ్లపల్లికి చెందిన బియ్యం వ్యాపారి తవనం శ్రీనివాసరెడ్డి, డ్రైవర్ బాలూనాయక్లు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. వీటిని మిల్లులో పాలిషింగ్ చేసి ప్రభుత్వానికి లేవీ కింద పెట్టేందుకు యత్నించారు. గ్రామస్థుల సమాచారం మేరకు మఠంపల్లి పోలీసులు రాధిక రైస్ మిల్లుపై మంగళవారం దాడి చేసి పాలిషింగ్ చేయడానికి సిద్ధంగా ఉంచిన 278 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమాని లక్ష్మీనారాయణ, డ్రైవర్ బాలూనాయక్లను అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్పీ చెప్పారు. కొద్ది నెలలుగా నిందితులు ఈ దందా చేస్తూ పాలిషింగ్ చేస్తున్న బియ్యాన్ని స్థానికంగా విక్రయించడం, ఆంధ్రాకు తరలించడం చేస్తున్నారని తెలిపారు.
పీడీ యాక్టు నమోదు చేస్తాం: ఎస్పీ
మిల్లు యజమానురాలి భర్త లక్ష్మీనారాయణ, బియ్యం వ్యాపారి శ్రీనివాసరెడ్డిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు