పాఠశాలలకు పంపాలా.. వద్దా..!

ABN , First Publish Date - 2020-11-22T05:16:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలా? వద్దా? అనే సందిగ్థంలో తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు బోధన సాగుతోంది. ఈ నెల 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించగా.. పదో తరగతి విద్యార్థుల హాజరుతో పోల్చితే తొమ్మిదో తరగతి విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది.

పాఠశాలలకు పంపాలా.. వద్దా..!
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు

  రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం

 తల్లిదండ్రుల్లో సందిగ్థం

(ఇచ్ఛాపురం రూరల్‌)

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపాలా? వద్దా? అనే సందిగ్థంలో తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు బోధన సాగుతోంది. ఈ నెల 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించగా.. పదో తరగతి విద్యార్థుల హాజరుతో పోల్చితే తొమ్మిదో తరగతి విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులు 24,384 మంది ఉండగా... రోజుకు సగటున 16,500 మంది మాత్రమే  హాజరవుతున్నారు. 9వ తరగతి విద్యార్థులు 23,045 ఉండగా... సగటున 4,150 మంది మత్రమే పాఠశాలలకు వెళ్తున్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా... అంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించేలా పర్యవేక్షించడం,  బడి బయట చిరుతిళ్లు నుంచి దూరం చేయడం కష్టమని తల్లిదండ్రులు అంటున్నారు. కరోనా రెండోదశ ప్రారంభమవుతుందని రాష ్ట్రప్రభుత్వమే వివిధ సందర్భాల్లో చెబుతున్న నేపథ్యంలో పిల్లల్ని బడికి పంపించే విషయంలో చాలామంది తల్లిదండ్రులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో 6,7,8 తరగతుల విద్యార్థుల హాజరు కూడా మెరుగ్గా ఉంటుందని భావించలేమని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలు తెరిస్తే ఎలా ఉంటుంది? తెరవకపోతే జరిగే నష్టం ఏమిటనే అంచనా వేయలేక ప్రైవేటు యాజమాన్యాలు సందిగ్ధంలో ఉన్నాయి. 


జాగ్రత్తలు తీసుకుంటున్నాం : 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థులు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నాం. తరగతి గదులు శానిటేషన్‌ చేయించాం. పిల్లలందరికీ తరగతి గదుల్లో శానిటైజర్‌ అందిస్తాం. కరోనా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

- కె.వాసుదేవరావు, డెప్యూటీ డీఈవో, టెక్కలి. 

Updated Date - 2020-11-22T05:16:51+05:30 IST