సంచలన తీర్పు : సకాలంలో ఫ్లాట్లు ఇవ్వలేదని రియల్టర్‌కు 18 నెలల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-04-29T16:38:11+05:30 IST

సకాలంలో ఫ్లాట్లు ఇవ్వలేదని రియల్టర్‌కు 18 నెలల జైలు శిక్ష..

సంచలన తీర్పు : సకాలంలో ఫ్లాట్లు ఇవ్వలేదని రియల్టర్‌కు 18 నెలల జైలు శిక్ష

  • ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర వినియోగదారుల ఫోరం


హైదరాబాద్‌ సిటీ : పలు సందర్భాల్లో తాము ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేసిన రియల్టర్‌కు రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం గడచిన 15 ఏళ్లలో జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఇదే మొదటిసారి. నగరంలో పలు భవనాలను నిర్మించిన ఘరోండా బిల్డర్స్‌ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు పలువురు డబ్బులు చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అగ్రిమెంట్‌ ప్రకారం ఇళ్లు పూర్తిచేయకపోవడంతో సంస్థ ఎండీ సునీల్‌ జె.సచ్‌దేవ్‌పై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి తీసుకున్న డబ్బును వడ్డీతోపాటు చెల్లించాలని ఎండీని ఆదేశిస్తూ పలు జిల్లాల వినియోగదారుల ఫోరంలతోపాటు రాష్ట్ర ఫోరం కూడా గతంలో తీర్పులు ఇచ్చాయి. అయితే సదరు ఎండీ ఫోరం ఆదేశాలను పాటించకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించాడు.


చెల్లని చెక్కులు ఇవ్వడం, డబ్బులు చెల్లిస్తానని మాట ఇచ్చి తప్పడంతోపాటు... తన వద్ద డబ్బుల్లేవంటూ సివిల్‌ కోర్టులో ఐపీ పిటిషన్‌ దాఖలుచేశాడు. దీన్ని సాకుగా చూపిస్తూ ఫోరం తీర్పు అమలును నిలిపివేయాలని అభ్యర్థించాడు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌ నేతృత్వంలోని జస్టిస్‌ మీనా రంగనాథన్‌, జస్టిస్‌ కె.రంగారావులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఫోరం ఆదేశాలు పాటించకుండా సునీల్‌ సచ్‌దేవ్‌ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014, 2015, 2017 కేసుల్లో ఇచ్చిన తీర్పులను అమలుపరచని కారణంగా జైలు శిక్షను విధించింది. ఒక్కో కేసులో 6 నెలలు చొప్పున వరుసగా మొత్తం 18నెలలపాటు జైలు శిక్ష విధించింది.

Updated Date - 2022-04-29T16:38:11+05:30 IST