కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయరా?
ABN , First Publish Date - 2021-10-27T05:29:32+05:30 IST
మొక్కజొన్న రైతు వ్యాపారుల చేతుల్లో దగా పడుతున్నాడు.
- జిల్లాలో 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు
- చేతి వాటం ప్రదర్శిస్తున్న వ్యాపారులు
- క్వింటాకు 4 కేజీల తరుగు పేరుతో కోత
- గిట్టుబాటు ధర లేక ఆందోళనలో రైతులు
రుద్రవరం, అక్టోబరు 26: మొక్కజొన్న రైతు వ్యాపారుల చేతుల్లో దగా పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాడు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఒక్కో ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి పెట్టారు. దిగుబడి చూస్తే అంతంత మాత్రమే వచ్చింది. వచ్చిన దిగుబడిని అమ్మేందుకు తగిన ఏర్పాట్లు లేక ఇబ్బంది పడుతున్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు మోక్షమెప్పుడో..
మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేసేదీ తెలియక రైతులు ఇబ్బందిపడుతున్నారు. గతేడాది ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఈసారి ఏర్పాటు చేయకపోవ డంతో వ్యాపారులు అడిగిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారులు అందిన కాడికి రైతులను దోచేస్తున్నారు. ధర తేడా చెప్పి కొంత, ఎక్కువ తూకాలతో మరికొంత దోచేస్తున్నారు. చివరికి రైతుల కష్టం దళారుల పాలు అవుతుంది.
తరుగు పేరుతో కోత
వ్యాపారులు అడిగన కాడికి తరగు ఇస్తేనే మొక్కజొన్నలు కొంటున్నారు. ఒక్కో క్వింటాకు 4కేజీల తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. ఇదేందని రైతులు ప్రశ్నిస్తే వ్యాపారులు కొనడం లేదు.
గిట్టుబాటు ధర ఏదీ..?
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. గిట్టుబాటు ధర కూడా లేదు. క్వింటాకు రూ.1,530 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
క్వింటాకు 4 కేజీల తరుగు
క్వింటాకు 100 కేజీలు తూకం వేయాల్సి ఉండగా 104 కేజీలు తూ కం వేస్తున్నారు. 4 కిలోలు తరుగు పేరుతో కాజేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
- శ్రీనివాసులు, రైతు, రుద్రవరం
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. అలా చేస్తే మొక్కజొన్న రైతులు కాస్త ఊపిరి తీసుకుంటారు.
- ఓబులేసు, రైతు, రుద్రవరం
ప్రభుత్వానికి నివేదిక పంపించాం
ప్రభుత్వానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
- ప్రసాదరావు, ఏవో, రుద్రవరం