ఊరిస్తున్న మేఘాలు
ABN , First Publish Date - 2022-06-27T07:18:36+05:30 IST
వర్షాకాల సీజన్ ప్రారంభమైనా వర్షాలు సంవృద్ధిగా కురియకపోవడం, ప్రతీ రోజూ మేఘాలు ఊరిస్తుండటంతో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మృగశిరకార్తె తర్వాత దేవరకొండ డివిజన్లో 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
డివిజన్లో వర్షం కోసం రైతుల ఎదురుచూపులు
వేసిన విత్తనాలు ఎండు దశకు చేరుకుంటున్నాయని ఆందోళన
దేవరకొండ, జూన్ 26: వర్షాకాల సీజన్ ప్రారంభమైనా వర్షాలు సంవృద్ధిగా కురియకపోవడం, ప్రతీ రోజూ మేఘాలు ఊరిస్తుండటంతో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మృగశిరకార్తె తర్వాత దేవరకొండ డివిజన్లో 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో డివిజన్ పరిధిలోని చందంపేట, నేరేడుగొమ్ము, దేవరకొండ, పీఏపల్లి, చిం తపల్లి మండలాల రైతులు మొదటి విడతగా పత్తి విత్తనాలు వేశారు. ఆ తర్వాత వర్షం కురియకపోవడం తో విత్తనాలు మొలకలు వస్తున్నా వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది దేవరకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో 1 లక్ష 90వేల ఎకరాల్లో పత్తి పంట వేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే కురిసిన తొలకరి వర్షానికి 20 నుంచి 30వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ప్రతీ రోజు మేఘాలు ఊరిస్తుండటంతో వర్షాలు పడతాయనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 40వేల ఎకరాలకుపైగా పత్తి పంట వేసేందుకు రైతులు మొగ్గుచూపుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. డిండి, ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో 40 నుంచి 50 వేల ఎకరాల వరకు వరిసాగు చేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు .ప్రాజెక్టులునిండితే నీటి విడుదలపై కా ర్యాచరణరూ పొందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టు పరిధిలో నీటి విడుదల విషయమై ఎలాంటినిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండాలని రైతులు కోరుకుంటున్నారు. బోరుబావుల వద్ద కూరగాయ లు, ఆకు కూరలు వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.