బస్సు లోయలో పడి ఏడుగురు జవాన్ల మృతి

ABN , First Publish Date - 2022-08-17T06:48:26+05:30 IST

జమ్మూ-కశ్మీర్‌లో మంగళవారం బస్సు లోయలో పడిన సంఘటనలో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు (ఐటీబీపీ)కి చెందిన ఏడుగురు జవాన్లు మరణించారు. 39 మందితో వెళ్తున్న ఆ పోలీసు బస్సు చందన్‌వారీ- పహల్‌గాంల మధ్య లోయలో

బస్సు లోయలో పడి ఏడుగురు జవాన్ల మృతి

అందరూ ఐటీబీపీకి చెందిన వారే.. మరో 32 మందికి గాయాలు 


శ్రీనగర్‌, ఆగస్టు 16: జమ్మూ-కశ్మీర్‌లో మంగళవారం బస్సు లోయలో పడిన సంఘటనలో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు (ఐటీబీపీ)కి చెందిన ఏడుగురు జవాన్లు మరణించారు. 39 మందితో వెళ్తున్న ఆ పోలీసు బస్సు చందన్‌వారీ- పహల్‌గాంల మధ్య లోయలో  ప్రవహిస్తున్న నదిలో బోల్తాపడింది. బస్సులో మిగిలిన 32 మంది కూడా గాయపడగా, వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలంలో ఇద్దరు, మిగిలిన వారు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా అమర్‌నాథ్‌ యాత్రలో బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిలవడమే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి సైన్యం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది.


తీవ్రంగా గాయపడ్డవారిని శ్రీనగర్‌, మిగిలినవారిని అనంత్‌నాగ్‌ ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌, జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా తదితరులు సంతాపం తెలిపారు.  

Updated Date - 2022-08-17T06:48:26+05:30 IST