బైడెన్ బాటలో పలువురు భారతీయ వైద్యులు..
ABN , First Publish Date - 2020-12-22T20:13:43+05:30 IST
కరోనా వ్యాక్సిన్పై ఉన్న అపోహలను తొలిగించేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం లైవ్లో ఫైజర్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు.
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్పై ఉన్న అపోహలను తొలిగించేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం లైవ్లో ఫైజర్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. ఆయన బాటలోనే అమెరికాలోని పలువురు భారత సంతతి వైద్యులు కూడా టీకా పట్ల జనాల్లో ఉన్న భయాన్ని పొగొట్టేందుకు తాజాగా లైవ్లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి భయంలేకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. మహమ్మారి నుంచి రక్షించే ఏకైక ఆయుధం టీకా మాత్రమేనని వైద్యులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ అనేది 'సైంటిఫిక్ బ్లెస్సింగ్' అని తెలిపారు. ప్రపంచాన్ని కరోనాపై పోరులో గెలిపించే ఏకైక అస్త్రంగా వైద్యులు దీనిని అభివర్ణించారు.
"మనం అందరం తప్పకుండా టీకా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ చాలా సమర్థవంతమైంది. కరోనాపై పోరులో మనల్ని గెలిపిస్తుంది. త్వరలోనే టీకా మంచి ఫలితాలను మనం చూడబోతున్నాం. వ్యాక్సిన్ మాత్రమే మనల్ని మహమ్మారి నుంచి రక్షించగలదు, ఆ ఆయుధం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. కనుక ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలి. ఇప్పుడు మేము అదే చేశాం." అని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) మాజీ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి అన్నారు. ఇటీవలే తాను ఫైజర్ టీకా తీసుకున్నానని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన తెలిపారు. కనుక అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని రెడ్డి సూచించారు. ఇది చాలా ప్రభావవంతమైంది, సురక్షితమైందిగా ఆయన పేర్కొన్నారు. కరోనాపై పైచేయి సాధించాలంటే మన ముందు ఉన్న ఏకైక మార్గం టీకా మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇక వైరస్తో సతమతమవుతున్న అగ్రరాజ్యం వారం రోజుల క్రితం యుద్ధప్రాతిపదికన ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వారం రోజుల వ్యవధిలోనే మరో వ్యాక్సిన్ మోడెర్నాను కూడా అత్యవసర వినియోగానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల చివరి నాటికి యూఎస్కు మోడెర్నా 20 మిలియన్ డోసులు డెలివరీ చేయనుంది. ఒకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసిన యూఎస్కు మరోవైపు పాజిటివ్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా, సోమవారంతో దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య ఏకంగా 18 మిలియన్ల మార్క్ను కూడా దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం లాంటి మూడు ప్రాథమిక నిబంధనల ద్వారా మహమ్మారి బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చని భారత సంతతి వైద్యుడు డాక్టర్ జయేష్ షా అన్నారు.