అమిత్షా వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే: కాంగ్రెస్
ABN , First Publish Date - 2022-05-16T08:49:03+05:30 IST
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు.
హైదరాబాద్/కడ్తాల్, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 4ు రిజర్వేషన్ కల్పనకు సంబంధించిన కేసు ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్లోనే ఉందన్నారు. అయితే తుది తీర్పునకు లోబడి రిజర్వేషన్లు కొనసాగించవచ్చంటూ సుప్రీం కోర్టు పేర్కొనడంతో ఆ రిజర్వేషన్ అమలవుతోందని ఆయన పేర్కొన్నారు. అమిత్షా చేసిన వ్యాఖ్యలు మోసపూరితమైనవని టీపీసీసీ నేత నిరంజన్ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు.