నిర్మాణానికి నోచుకోని షాదీఖానా
ABN , First Publish Date - 2021-03-08T05:53:50+05:30 IST
మార్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్లో ముస్లింలకు కేటాయించిన ఉర్దూఖర్, షాదీఖానా నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు.
పోటాపోటీగా శంకుస్థాపనలు
నిరుపయోగంగా మారుతున్న స్థలం
మార్కాపురం (వన్టౌన్) మార్చి 7: మార్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్లో ముస్లింలకు కేటాయించిన ఉర్దూఖర్, షాదీఖానా నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. కంభం సెంటర్ లోని చిన్నపిల్లల పార్కు స్థలాన్ని చాలా ఏళ్ల కిందట షాదీఖానా నిర్మాణానికి కేటాయించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజీవ్ నగరబాటలో భాగంగా మార్కాపురం పట్టణం వచ్చినప్పుడు సాగర్ జలాల కోసం రూ.36 కోట్లు, పట్టణంలో ముస్లింల కోసం షాదీఖానా నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వాలు మారుతున్నా నేటి వరకు షాదీఖానా నిర్మాణం జరగలేదు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి శంకుస్థాపన రాయి వేశారు. టీడీపీ హయాం లో అప్పటి మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 2016లో శంకుస్థాపన చేశారు. పోటాపోటీగా శంకుస్థాపనలు జరిగాయే తప్ప నేటికీ నిర్మాణానికి నోచుకోలేదు. షాదీఖానా స్థలం మాత్రం బహిరంగ మలమూత్ర విసర్జనకు ఉపయోగపడుతూ పాయిఖానాగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.