Mumbai cruise drugs case: బాలీవుడ్లో సంచలనం.. డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కొడుకు
ABN , First Publish Date - 2021-10-03T16:46:36+05:30 IST
ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు.
ముంబై: ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. రేవ్ పార్టీ నిర్వాహకులతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు ఉన్న లింకులపై ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్యన్ ఫోన్ను స్వాధీనం చేసుకుని అతడి కాల్స్ డేటాను, చాట్స్ను పరిశీలిస్తున్నారు.
తీగ లాగితే డొంక కదిలింది
గోవాలో తీగలాగితే ముంబైలో డ్రగ్స్ రాకెట్ డొంక కదలింది. సముద్రం మధ్యలో ఓ భారీ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి అండర్ కవర్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో డ్రగ్స్ తీసుకుంటున్న దాదాపు 10 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ పార్టీ సూత్రధారి ఎఫ్టీవీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఖాషిఫ్ ఖాన్ అని తెలుస్తోంది. అతడిని కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.