ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం
ABN , First Publish Date - 2021-04-21T06:18:33+05:30 IST
మొదటి విడతగా నగరంలో రూ.3.50 కోట్లతో 30 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
- మంత్రి గంగుల కమలాకర్
- ముఖ్యమంత్రి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం
- సప్తగిరి కాలనీలో మేయర్తో కలిసి ఓపెన్జిమ్ను ప్రారంభించిన మంత్రి
కరీంనగర్ స్పోర్ట్స్, ఏప్రిల్ 20: మొదటి విడతగా నగరంలో రూ.3.50 కోట్లతో 30 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా మంగళవారం 35వ డివిజన్ సప్తగిరికాలనీ ప్రభుత్వ పాఠశాలలో మేయర్ సునీల్రావు, కమిషనర్ క్రాంతి, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, పాలకవర్గ సభ్యులతో కలిసి మంత్రి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. వివిధ రకాల పరికరాలను మేయర్ సునీల్రావు, మంత్రి గంగుల కమలాకర్ వ్యాయామం చేసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ నగర ప్రజలకు ఇచ్చిన మాటను వమ్ము చేయకుండా కరీంనగర్ నగరాన్ని అన్ని రకాల హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ, సహకారంతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టి సుందరంగా తయారు చేస్తున్నామన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన నిధులు, వివిధ ప్రభుత్వ గ్రాంట్లతోపాటు స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ ఇబ్బందులకు గురి చేస్తున్నా అభివృద్ధి కుంటు పడకుండా అహర్నిశలు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్లలో ప్రజల ఫిజికల్ ఫిట్నెస్ను పెంచేందుకు డివిజన్కు ఒక జిమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి విడతగా 3.50 కోట్ల నిధులతో 30 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికి రెండు జిమ్ములను ప్రారంభించామన్నారు. నగరంలో పలు పార్కులను సుందరీకరించి ప్రజలకు అందించామన్నారు. నగరంలో రోజు నీటి సరఫరా విజయవంతంగా కొనసాగిస్తున్నామని, రాబోయే రోజుల్లో 24/7 నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా కరీంనగర్ను అభివృద్ధి చేసి అందిస్తామని, ఇప్పటికే ఐటీ టవర్, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేశామని, త్వరలోనే రివర్ ఫ్రంట్ నిర్మాణం చేసి ప్రజలకు అందిస్తామన్నారు. కార్పొరేటర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు తోట రాములు, గందె మాధవి మహేశ్, దిండిగాల మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, వాల రమణారావు, ఎస్ఈ కృష్ణారావు, ఈఈ రామన్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.