చూస్తూ ఉండండి.. ముంబై ఎలా పుంజుకుంటుందో: షేన్బాండ్
ABN , First Publish Date - 2022-04-08T23:11:39+05:30 IST
ఐపీఎల్ ట్రోఫీని ఐదుసార్లు కొల్లగొట్టిన ముంబై ఇండియన్స్కు ఈసారి కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు
ముంబై: ఐపీఎల్ ట్రోఫీని ఐదుసార్లు కొల్లగొట్టిన ముంబై ఇండియన్స్కు ఈసారి కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడింది. పాయింట్ల ఖాతా తెరిచేందుకు నానా కష్టాలు పడుతోంది. వరుస పరాజయాలపై తాజాగా ఆ జట్టు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పందించాడు. బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నాడు. నిజానికి ఆడిన మూడు మ్యాచుల్లోనూ ముంబై గెలవాల్సిందేనని, అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామన్నాడు.
బుధవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో పోరు చివరి వరకు ఉత్కంఠగానే సాగింది. అయితే, పాట్ కమిన్స్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. 15 బంతుల్లోనే 56 పరుగులు చేసి ముంబై చేతి నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. అయితే, అవకాశాలు మూసుకుపోలేదని, ఆట తీరును మెరుగుపరుచుకుంటే జట్టు మళ్లీ పుంజుకుంటుందని షేన్ బాండ్ అన్నాడు.
మొన్నటి మ్యాచ్లో తొలి పది ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, అయితే రెండు ఓవర్లు మాత్రమే మ్యాచ్ను మలుపుతిప్పాయని పేర్కొన్నాడు. అనుకున్న ప్రకారం ప్రణాళికలను అమలు చేయగలిగితే విజయం సాధిస్తామని బాండ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, రోహిత్ సేన తన తర్వాతి మ్యాచ్లో ఆర్సీబీతో శనివారం(ఏప్రిల్ 9న) తలపడుతుంది.