Presidential polls: శరద్ పవార్ సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2022-06-15T01:46:31+05:30 IST
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలిచేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలిచేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సున్నితంగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఆయనను నిలిపేందుకు మంగళవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, వామపక్షాల సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
శరద్ పవార్ను కలిసిన అనంతరం సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలిచేందుకు శరద్ పవార్ తిరస్కరించారని చెప్పారు. అంతకుముందు న్యూఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయనతో సమావేశమైనవారిలో మమత బెనర్జీ, సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, పీసీ చాకో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని వారికి ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఎటూ ఓటమి తప్పదనే ఆయన ఈ ఎన్నికల గోదాలో దిగడానికి ఇష్టపడటం లేదని సమాచారం.
సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్ పోటీ చేయబోరని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇతర అభ్యర్థులను పరిశీలిస్తున్నామని చెప్పారు.
మమత బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీజేపీయేతర పార్టీల నేతలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 22 మంది నేతలను ఆహ్వానించారు.
రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 15న విడుదలవుతుంది. జూన్ 29 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జూలై 18న పోలింగ్ జరుగుతుంది. అవసరమైతే జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.