ఉమ్రాన్ మాలిక్ను వెంటనే టీమిండియాలోకి తీసుకోండి: శశిథరూర్
ABN , First Publish Date - 2022-04-18T22:13:14+05:30 IST
గంటకు150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ యువ
ముంబై: గంటకు150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐని కోరారు. మాలిక్లో రక్తం ఉరకలెత్తుతోందని, అతడిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని ఆకాశానికెత్తేశారు. అతడిని భారత జట్టులోకి తీసుకుని ఇంగ్లండ్ కనుక తీసుకెళ్తే జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఆంగ్లేయుల భరతం పడతాడని పేర్కొన్నారు.
శశిథరూర్ మాత్రమే కాదు, పలువురు మాజీ క్రికెటర్లు కూడా మాలిక్ ప్రతిభకు ముగ్ధులవుతున్నారు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్కు ముందు ఆణిముత్యంలాంటి బౌలర్ వెలుగులోకి వచ్చాడని, అతడిని జట్టులోకి తీసుకుంటే అద్భుతాలు చేస్తాడని అంటున్నారు. నిన్న (ఆదివారం) పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 22 ఏళ్ల ఈ శ్రీనగర్ బౌలర్ మరోమారు చెలరేగాడు.
చివరి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 28 పరుగులిచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అందుకున్నాడు. అంతేకాదు, అతడి ఖాతాలో మరో ఘనమైన రికార్డు కూడా చేరింది. ఐపీఎల్లో చివరి ఓవర్ను మెయిడెన్ వేసిన నాలుగో బౌలర్గా ఉమ్రాన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు 2008లో ఇర్ఫాన్ పఠాన్, 2009లో లసిత్ మలింగ, 2017లో జయదేవ్ ఉనద్కత్ ఈ ఘనత సాధించారు.