Bharat Jodo Yatra : రాహుల్ యాత్ర దేశానికి, పార్టీకి ప్రయోజనకరం : శశి థరూర్

ABN , First Publish Date - 2022-09-06T22:50:21+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం నుంచి

Bharat Jodo Yatra : రాహుల్ యాత్ర దేశానికి, పార్టీకి ప్రయోజనకరం : శశి థరూర్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం నుంచి ప్రారంభిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) వల్ల దేశానికి, పార్టీకి మేలు జరుగుతుందని ఆ పార్టీ నేత శశి థరూర్ (Shashi Tharoor) చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను సమైక్యపరచడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెప్పారు. ఆయన మంగళవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 


ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, తాము వారి కోసం పోరాడుతున్నామని చెప్పడానికి భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందని శశి థరూర్ తెలిపారు. భారత్‌ను సమైక్యపరిచేందుకు, అదేవిధంగా కాంగ్రెస్‌‌ను సమైక్యపరిచేందుకు కూడా ఈ యాత్ర దోహదపడుతుందన్నారు. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా? అని అడిగినపుడు శశి థరూర్ మాట్లాడుతూ, ఎన్నికలు జరగడాన్ని తాను స్వాగతించానని చెప్పారు. ఎన్నికలు జరగడం పార్టీకి శ్రేయస్కరమని తెలిపారు. 10,000 మంది ఓటర్లు ఉన్న ఏ రాజకీయ పార్టీ అధ్యక్ష పదవి కోసం బహిరంగంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రజాస్వామిక సూత్రాన్ని తాను వెల్లడించడంతో దేశవ్యాప్తంగా చాలా మంది కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాన్ని స్వాగతిస్తున్నారన్నారు. తాను తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదన్నారు. తాను గతంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పానని తెలిపారు.


సభ్యులకు విస్తృత అవకాశాలను కల్పించేందుకు ఎక్కువ మంది పోటీ చేస్తారని తాను ఆశిస్తున్నానని తెలిపారు. ఇప్పటి వరకు తాను పోటీ చేస్తానని కానీ, పోటీ చేయనని కానీ చెప్పలేదని, బరిలో ఉండటం, లేకపోవడం, ఈ రెండిటిలో దేనినీ తోసిపుచ్చలేదని తెలిపారు. 


Updated Date - 2022-09-06T22:50:21+05:30 IST