హిందుత్వంపై రాహుల్ గాంధీకి శశి థరూర్ మద్దతు
ABN , First Publish Date - 2021-12-29T19:20:34+05:30 IST
హిందూయిజం, హిందుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
తిరువనంతపురం : హిందూయిజం, హిందుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న వైఖరిని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ సమర్థించారు. రాజస్థాన్లో జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గతంలో తాను చేసిన పోస్ట్ను మరోసారి శశి థరూర్ షేర్ చేశారు. ఈ అంశాలు నేటికీ సరిపోయేవేనని పేర్కొన్నారు.
రాజస్థాన్లోని కాంగ్రెస్ కార్యకర్తలకు మూడు రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలకు తలవంచేవారు హిందుత్వాన్ని అనుసరించేవారేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ బుధవారం సమర్థించారు.
‘‘రెండేళ్ళ క్రితం. ఇప్పటికీ సరిపోయేదే. @RahulGandhi @INCIndia’’ అని శశి థరూర్ బుధవారం ట్వీట్ చేశారు. ‘‘అసంపూర్ణంగా ఉన్నప్పటికీ, ఓ ఆసక్తికరమైన తులనాత్మక పరిశీలన చక్కర్లు కొడుతోంది. #HinduismVsHindutva’’ అని పేర్కొన్నారు.
రెండేళ్ల క్రితం శశి థరూర్ చేసిన పోస్ట్లో, విభిన్న మూలాలుగల, వ్యవస్థాపకుడు లేని, వివిధ భారతీయ సంస్కృతులు, సంప్రదాయాల కలయికే హిందూయిజమని పేర్కొన్నారు. సావర్కర్ ప్రతిపాదించిన ఏకజాతి జాత్యహంకార-భౌగోళిక వర్గమే హిందుత్వమని పేర్కొన్నారు. హిందూయిజం వేలాది సంవత్సరాల పురాతనమైనదని, హిందుత్వాన్ని మొదట 1923లో సావర్కర్ ప్రతిపాదించారని, ఇది రాజకీయ సిద్ధాంతమని తెలిపారు. హిందూయిజానికి వేదాలతో సహా అనేక గ్రంథాలు ఉన్నాయని, కానీ హిందుత్వానికి 1928లో ప్రచురితమైన ‘హిందుత్వ : హూ ఈజ్ ఏ హిందూ?’ అనే రాజకీయ కరపత్రమే ముఖ్యమైనదని వివరించారు.