‘ఆమెను చేర్చుకుంటేనే పార్టీకి భవిష్యత్తు’
ABN , First Publish Date - 2022-04-05T15:07:57+05:30 IST
శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకుంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్సెల్వం సమక్షంలో తేని జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్
- ఓపీఎస్ సమక్షంలో తేని జిల్లా కార్యదర్శి
పెరంబూర్(చెన్నై): శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకుంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్సెల్వం సమక్షంలో తేని జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. బోడిచెట్టిపాళయం సమీపంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని పన్నీర్సెల్వం ప్రారంభించారు. ఈ సందర్భంగా పన్నీర్సెల్వం మాట్లాడుతూ ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారం చేపట్టిన డీఎంకే ఆస్తి పన్ను పెంపుతో ప్రజలపై భారాలు మోపిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే కోటగా ఉన్న ఆండిపట్టిలో వరుసగా రెండవ సారి ఓటమి చెందడం బాధాకరమన్నారు. శశికళను పార్టీలో చేర్చుకోవడంతో పాటు అందరూ సమష్టిగా కృషిచేస్తేనే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే అవకాశముందని, కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో సమావేశానికి వచ్చిన అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు.