త్వరలో రాజకీయ పర్యటన: Shashikala
ABN , First Publish Date - 2022-04-27T13:07:09+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ త్వరలో రాజకీయ పర్యటన ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం విమానాశ్రయంలో ఆమె మీడియాతో
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ త్వరలో రాజకీయ పర్యటన ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం విమానాశ్రయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నానని, ఇది ముగియగానే రాజకీయ పర్యటన ప్రారంభిస్తానని వెల్లడించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వ్యవహారంపై స్థానిక సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై త్వరలో అప్పీలుకు వెళ్తానని స్పష్టం చేశారు. విలేఖరులతో క్లుప్తంగా మాట్లాడిన తర్వాత ఆమె విమానంలో బయలుదేరి తిరుచ్చి చేరుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయం వద్ద మీడియాతో ఆమె మాట్లాడుతూ... కీలక రాజకీయాల్లోకి వచ్చాక, పార్టీలో క్రియాశీలకంగా మారాక ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవాలా? లేక ఒంటరిగానే కొనసాగాలా? అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటానని, అంతవరకూ వేచి చూడాలని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. శశికళను ఆహ్వానించేందుకు వెళ్లే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం కార్యకర్తలను, నాయకులను ఆ పార్టీ నాయకుడు దినకరన్ పార్టీ నుంచి తొలగిస్తుండటంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.