షీకి అండగా టీం
ABN , First Publish Date - 2022-06-28T05:22:10+05:30 IST
అరాచకాలు, అత్యాచారాలు, ఈవ్టీజింగ్ల నుంచి మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా షీటీంలు పని చేస్తున్నాయి.
- రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా
- మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ
- షీటీం ద్వారా నాలుగేళ్లలో 1,360 కార్యక్రమాలు
గద్వాల క్రైం, జూన్ 27 : అరాచకాలు, అత్యాచారాలు, ఈవ్టీజింగ్ల నుంచి మహిళలు, యువతులు, బాలికలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా షీటీంలు పని చేస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా ఆవిర్భావం అనంతరం ఎస్పీ ఆదేశం మేరకు పోలీసు శాఖ ‘షీటీం’ పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృం దం సభ్యులు సాధారణ వ్యక్తుల్లాగానే రద్దీ ప్రాంతాల్లో జనంతో కలిసిపోయి ప్రత్యేకంగా నిఘా ఉంచుతున్నారు. ఈవ్టీజీంగ్, అరాచకాలకు పాల్పడే వారిని గుర్తించి ఆటకట్టిస్తున్నారు. షీటీంలో డీఎస్పీ పర్యవేక్షణలో ఒక ఎస్ఐ, ఇద్దరు మహళా కానిస్టేబుళ్లు, ఒక పురుష కానిస్టేబుల్ పని చేస్తారు. ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండు, కళాశాలలు, సినిమా థియేటర్లు, బస్స్టాపులలో నిఘా వేసి, ఆకతాయిలను గుర్తిస్తారు. అవసరమైతే వారిని అదుపులోకి తీసుకొని తగిన చర్యలు తీసుకుంటారు. ఇటీవలే షీటీం ఎస్ఐగా రషీద్ఖాన్ను నియ మించారు. ఆయనతో పాటు కానిస్టేబుళ్లు హనుమంతు, లోకేశ్వరి, దివ్య విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళలు ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 7993131391 ఫోన్ నెంబర్కు కాల్ చస్తే షీటీం బృందం సభ్యులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటున్నారు.
అరాచకాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
మహిళలు, యువతులు, విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన బృందాలు పలు కార్య క్రమాలు చేపడుతున్నాయి. తద్వారా వారికి భరోసా కల్పించడంతో పాటు, వారిలో అత్యస్తైర్యాన్ని పెంపొం దిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాలలో 1,360 అవగాహనా కార్యక్రమాలు నిర్వ హిం చారు. ఇప్పటివరకు షీటీంకు వివిధ సమస్యలపై 294 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 29 సంఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో 15 సంఘటనలపై పెట్టి కేసులు నమోదయ్యాయి. సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల ఆఽధారంగా మరో 53 కేసులు నమోదు చేశారు. దీంతో పాటు 253 సంఘటనలకు సంబంధించి బాధ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
జిల్లాలో పెరిగిన కేసుల సంఖ్య
జిల్లాలో మహిళలపై, యువతులపై, బాలికలపై కొంతకాలంగా వేఽధింపులు, అఘాయిత్యాలు ఎక్కు వగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వరకు వేధింపుల కేసులు ఎనిమిది, రేప్ కేసులు 10, పోక్సో కేసులు 13, కిడ్నాప్ కేసులు మూడు నమోదు అయినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.
మహిళలను వేధిస్తే ఉపేక్షించేది లేదు
మహిళలు, యువతులు, బాలికలను వేధించేవారు ఎవరైనా ఊపేక్షించేది లేదు. వారిపై కేసులు నమోదు చేస్తాం. మహిళలు వేధింపులకు గురౌతున్నట్లైతే తమ దృష్టికి తీసుకొస్తే, చర్యలు తీసుకుంటాం. వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్ఐలను ఆదేశించాం. వేధింపుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
- రంజన్ రతన్కుమార్, ఎస్పీ