శేషవాహనంపై కామాక్షితాయి
ABN , First Publish Date - 2022-05-24T05:40:26+05:30 IST
బుచ్చి మండలం జొన్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి, అమ్మవార్లు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
బుచ్చిరెడ్డిపాళెం, మే 23 : బుచ్చి మండలం జొన్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి, అమ్మవార్లు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి దివంగత మేనకూరు ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరుచ్చి ఉత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి జొన్నవాడకు చెందిన దివంగత శ్రీశైలం శ్రీనివాసులు కుమారులు ఉభయ కర్తలుగా వ్యవహరించారు. ఉత్సవాలను ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, ఈవో డీ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. కాగా, నెల్లూరు రూరల్ మండలం నరసింహపురానికి (దేవరపాళెం) చెందిన పెనుబాక శ్రీనివాసులురెడ్డి, వసుమతి దంపతులు, దగ్గుమాటి శ్రీకాంత్రెడ్డి, చిడుపూడి రూపేష్రెడ్డిలు రెండు గొడుగులు బహూకరించారు. అలాగే అమెరికాకు చెందిన కాసుకేల సీతాపతి, గాయత్రి దంపతులు సోమవారం రూ. 1,00,116లను ఆన్లైన్ ద్వారా అందజేసినట్లు ఆలయ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పురుషామృగం వాహనంపై స్వామి అమ్మవార్లు ఊరేగుతారు.
----------