బోరున విలపించిన Shilpa Chowdary.. విచారణలో ‘జెంటిల్మెన్’ సినిమా స్టోరీ.. ఐపీఎస్లు, బ్యూరోక్రాట్లూ బాధితులే..!
ABN , First Publish Date - 2021-12-05T14:02:58+05:30 IST
కిట్టీపార్టీలతో సంపన్న కుటుంబాల మహిళలను ఆకట్టుకుని, వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ..
హైదరాబాద్ సిటీ : కిట్టీపార్టీలతో సంపన్న కుటుంబాల మహిళలను ఆకట్టుకుని, వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో పెద్దల సొత్తు రికవరీపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శిల్పాచౌదరి బాధితుల జాబితాలో సెలబ్రిటీలు, ఐపీఎస్లు, ఇతర బ్యూరోక్రాట్ల బంధువులు కూడా ఉన్న నేపథ్యంలో.. సమస్యను సాఫ్ట్గా పరిష్కరించే దిశలో చర్యలు సాగుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ తరహా కేసులపై ఠాణాలకు వెళ్తే ‘సివిల్ కేసుల్ని కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలి’ అంటూ పోలీసులు తాపీగా సమాధానం ఇస్తారు. శిల్పాచౌదరి విషయంలో తమకు ఫిర్యాదు చేసిన వారికి సంబంధించిన దర్యాప్తుతోపాటు అనధికారికంగా తమకు వస్తున్న మౌఖిక ఫిర్యాదులు, పెరుగుతున్న ఒత్తిడితో సమాంతర దర్యాప్తుపైనే దృష్టిపెట్టారని తెలుస్తోంది. అసలు కేసు కాకుండా.. కొసరు కేసులపై శిల్పాచౌదరిపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
మోసం చేయను.. తిరిగిచ్చేస్తా..!
తనకు డబ్బులిచ్చిన వారిలో చాలామంది బ్లాక్మనీని వైట్గా మార్చుకునే ప్రయత్నం చేశారని తొలిరోజు పోలీసు కస్టడీ సందర్భంగా శిల్ప స్పష్టం చేసిన నేపథ్యంలో లోపల్లోపలే సెటిల్ చేయాలంటూ సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్ల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, శిల్పాచౌదరి రెండోరోజు పోలీసు కస్టడీలో పెద్దగా వివరాలేమీ చెప్పలేదని తెలిసింది. ‘నేను అమాయకురాలిని. రాధికారెడ్డి అనే మహిళ వద్ద పెట్టుబడి పెట్టాను. ఆమె చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదు. నేను ఎవరికీ అన్యాయం చేయను. అందరికీ డబ్బులిచ్చేస్తా’ అని చెప్పినట్లు సమాచారం.
సినిమా స్టోరీ..!
ఇంకో సందర్భంలో ఆమె 1993లో వచ్చిన ‘జెంటిల్మెన్’ సినిమా స్టోరీని వినిపించినట్లు తెలిసింది. ఓ ఆస్పత్రి నిర్మాణం కోసం కోట్ల రూపాయలను వెచ్చించినట్లు ఆమె పోలీసులకు చెప్పిందని సమాచారం. తమ ఇంట్లో చాలా ఆధారాలున్నాయని శిల్ప చెప్పినట్లు తెలిసింది. దాంతో పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. హవాలా డబ్బులపైనా పోలీసులు ఎలాం టి సమాధానాలను రాబట్టుకోలేదని సమాచారం. రెండు రోజుల కస్టడీ ముగియడంతో శిల్పాచౌదరిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచి తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే, రాధికారెడ్డి అనే పేరును శిల్ప వెల్లడించలేదని పోలీసులు చెబుతుండగా శనివారం రాత్రి రాధికారెడ్డి అనే పేరున్న మహిళ ఒకరు మాదాపూర్ డీసీపీని కలిశారు. శిల్పతో ఎలాంటి సంబంధం లేదని, తన పేరు మీడియాలో చక్కర్లు కొడుతోందని ఫిర్యాదు చేశారని సమాచారం. మీడియాను నియంత్రించాలని ఆమె కోరినట్లు తెలిసింది.
అస్వస్థత అంటూ హంగామా?
శుక్రవారం మొదటి రోజు విచారణ తర్వాత శిల్పకు నార్సింగ్లోని ఎస్వోటీ కార్యాలయంలో ఓ గదిని కేటాయించిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతగా ఉందంటూ హంగామా చేశారు. తలనొప్పిగా ఉందని, కళ్లు తిరుగుతున్నాయని, ఒళ్లునొప్పులు ఉన్నాయని బోరున విలపించారు. దాంతో పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు.