Shinde Vs Uddhav : థాకరేకు సుప్రీంకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-08-04T21:46:24+05:30 IST
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టు (Supreme Court
న్యూఢిల్లీ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టు (Supreme Court)లో గురువారం కాస్త ఊరట లభించింది. అసలైన శివసేన (Shiv Sena) పార్టీ తమదేనని ప్రకటించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని వర్గం కోరిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో శాసన సభలో విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) సవాల్ చేసింది. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది.
ఈ వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శివసేన పార్టీ ఎమ్మెల్యేలు అత్యధికంగా తనకే మద్దతిస్తున్నారని, పార్టీ కార్యకర్తల బలం కూడా తనకే ఉందని షిండే ఎన్నికల కమిషన్ (Election Commission)కు తెలిపారు. తన నేతృత్వంలోని పార్టీకే అసలైన శివసేనగా గుర్తింపునివ్వాలని కోరారు. పార్టీలో అత్యధికులు అంతర్గతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకునే నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) మాట్లాడుతూ, షిండే వర్గానికి చాలా ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు. ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను విస్మరిస్తే, ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా? అని అడిగారు. షిండే వర్గం తరపు న్యాయవాది హరీశ్ సాల్వే (Harish Salve) మాట్లాడుతూ, అదేమీ లేదని చెప్పారు.
అంతకుముందు శివసేన వర్గం సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, శివసేన రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్పష్టత రానంత వరకు ఏ వర్గం అసలైన శివసేన అవుతుందో ఎన్నికల కమిషన్ నిర్ణయించడం సాధ్యం కాదని తెలిపింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు జరిగిన రాజకీయ పరిణామాల్లో రెబెల్ ఎమ్మెల్యేలు గుజరాత్, అస్సాం, గోవా వెళ్ళారని తెలిపింది. షిండే వర్గం చట్టవిరుద్ధంగా, కృత్రిమంగా ఆధిక్యతను సంపాదించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పింది.
ఇదిలావుండగా, షిండే వర్గం వాదనలు వినిపిస్తూ తమదే నిజమైన శివసేన అని చెప్పింది. తమ శిబిరంలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమను రెబెల్స్ అని కేవలం 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న శిబిరం ఆరోపించడం సరికాదని తెలిపింది.
ఎన్నికల కమిషన్ గడువు
తమ తమ బలాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించేందుకు ఇరు వర్గాలకు ఆగస్టు 8 వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది ఏక్నాథ్ షిండే శిబిరంలో ఉన్నారు. అయితే మొత్తం పార్టీ తనవైపే ఉందని నిరూపించుకోవాలంటే క్షేత్ర స్థాయిలో కూడా మెజారిటీ ఉండాలి.
ఉద్ధవ్ థాకరే ఇప్పటికీ శివసేన పార్టీ అధ్యక్షుడిగానే ఉన్నారు. షిండే వర్గం తీసుకున్న కొన్ని నిర్ణయాలను థాకరే వర్గం న్యాయస్థానాల్లో సవాల్ చేసింది. షిండే వర్గం విప్లను, ఇతర నేతలను నియమించడం చట్టవిరుద్ధమని ఆరోపించింది.