నన్ను కిడ్నాప్ చేశారు: Shiv Sena ఎమ్మెల్యే Deshmukh
ABN , First Publish Date - 2022-06-22T22:22:16+05:30 IST
వసేన రెబల్స్ తనను బలవంతంగా సూరత్ తీసుకువెళ్లారని, తన పట్ల అనుచితంగా వ్యవహరించారని..
నాగపూర్: శివసేన రెబల్స్ తనను బలవంతంగా సూరత్ తీసుకువెళ్లారని, తన పట్ల అనుచితంగా వ్యవహరించారని ఆ పార్టీ ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ అన్నారు. శివసేనకు తాను విధేయుడనని, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు బాసటగా నిలుస్తానని చెప్పారు. ఏక్నాథ్ షిండే గ్రూప్తో తాను ఉన్నప్పడు వారు తిరుగుబాటు చేస్తున్నారనే విషయం తనకు తెలియదని దేశ్ముఖ్ చెప్పారు. బుధవారంనాడు ఆయన తిరిగి ముంబై తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఉద్ధవ్ వెంటే ఉంటానని అన్నారు. తనను కిడ్నాప్ చేసి సూరత్ తీసుకెళ్లారని, అక్కడి నుంచి తప్పించుకుని వచ్చానని చెప్పారు.
''షిండే నా సన్నిహితుడే కాకుండా క్యాబినెట్ మంత్రి. ఆ కారణంగానే ఆయనతో ఉన్నాను. సూరత్ హోటల్కు తీసుకువెళ్లిన తర్వాతే వాళ్ల ఉద్దేశం ఏమిటో నాకు అర్ధమైంది. ఇందుకు నేను నిరసన తెలిపారు. దాంతో 20 నుంచి 25 మంది దురుసుగా వ్యవహరిస్తూ ఆసుపత్రిలో చేర్చారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తనప్పటికీ ఆసుపత్రిలో చేర్చి బలవంతంగా ఇంజెక్షన్లు ఇచ్చారు.'' అని వివరించారు. సూరత్లో జరిగిందంతా ఒక కుట్ర అని అన్నారు. అకోలా జిల్లా బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి దేశ్ముఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, సోమవారం అర్ధరాత్రి నుంచి తన భర్త కనిపించడం లేదంటూ దేశ్ముఖ్ భార్య మంగళవారంనాడు పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.