రెబల్ ఎమ్మెల్యేలకు Sanjay Raut హెచ్చరిక
ABN , First Publish Date - 2022-06-25T16:47:25+05:30 IST
మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఐదో రోజుకు చేరుకోవడం, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి శివసేన..
ముంబై: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఐదో రోజుకు చేరుకోవడం, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి శివసేన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఓ ట్వీట్లో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ప్రముఖ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ కొటేషన్తో కూడిన ఒక ఫోటోను షేర్ చేశారు. ''డబ్బు, అధికారం, ప్రతిష్ట కోసం అతిగా ఆదుర్దా పడొద్దు. ఏదో ఒకరోజు వీటిలో దేనినీ ఆశించని వ్యక్తి మీకు తారసపడొచ్చు. అప్పుడు మనమెంత దయనీయ స్థితిలో ఉన్నామో అర్ధమవుతుంది'' అని రుడ్యార్డ్ కొటేషన్ను పరోక్షంగా రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రౌత్ పోస్ట్ చేశారు. జై మహారాష్ట్ర అనే నినాదాన్ని రౌత్ తన ట్వీట్కు జోడించారు.
కాగా, శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండేతో 38 ఎమ్మెల్యేలు గౌహతిలోని హోటల్లో ఉండటంపై ముఖ్యమంత్రి శుక్రవారంనాడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఏనాడు వెంపర్లాడలేదని, బతికినా చచ్చినా శివసేనతోనే ఉంటామని చెప్పిన ఎమ్మెల్యేలే ఇవాళ కట్టుతప్పారని, వీరు వెన్నుపోటుదారులని అన్నారు. శివసేనను లేకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. హిందుత్వను బీజేపీ సొంతం చేసుకోవాలనుకుంటోదని, బాలాసాహెబ్ సారథ్యంలో తాము హిందుత్వ బీజాలు నాటితే, ఆ పంట ప్రయోజనాలను బీజేపీ పొందుతోందని ఎద్దేవా చేశారు.