పీడీపీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది?: శివసేన

ABN , First Publish Date - 2022-03-22T21:26:47+05:30 IST

ఎంఐఎంతో మేము కలవబోం. ఈ విషయం ఇప్పటికే స్పష్టం చేశాం. అయినా కొందరు కావాలని ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను మళ్లీ చెప్తున్నా.. శివసేన హిందుత్వ పార్టీ. ఇకపై కూడా హిందుత్వ పార్టీనే. మాపై విమర్శలు చేస్తున్నవారు ఒకసారి తమవైపు..

పీడీపీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది?: శివసేన

ముంబై: మహా వికాస్ అగాడీ ప్రభుత్వంలో చేరుతామని ఏఐఎంఐఎం పార్టీ చేసిన ప్రతిపాదనపై భారతీయ జనతా పార్టీ భగ్గుమంది. శివసేన పార్టీ హిందుత్వంపై ప్రశ్నలు కురిపిస్తోంది, హిందుత్వ వ్యతిరేకులతో కలుస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. కాగా, బీజేపీ చేస్తున్న ఈ విమర్శలపై శివసేన ఘాటుగా స్పందించింది. శివసేన హిందుత్వ పార్టీయని, హిందుత్వ పార్టీగానే ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే తమపై విమర్శలు చేస్తున్న భారతీయ జనతా పార్టీనే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, అప్పుడు వారి సిద్ధాంతాలు, భావజాలం ఏమైందని ఘాటుగా ప్రశ్నించారు. తవ్వుకుంటూ పోతే ఇలాంటి తప్పిదాలు అనేకమున్నాయని ఆయన విమర్శించారు.


మంగళవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘‘ఎంఐఎంతో మేము కలవబోం. ఈ విషయం ఇప్పటికే స్పష్టం చేశాం. అయినా కొందరు కావాలని ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను మళ్లీ చెప్తున్నా.. శివసేన హిందుత్వ పార్టీ. ఇకపై కూడా హిందుత్వ పార్టీనే. మాపై విమర్శలు చేస్తున్నవారు ఒకసారి తమవైపు తిరిగి చూసుకోవాలి. కశ్మీర్‌లో పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు వాళ్ల భావజాలం, సిద్ధాంతాలు ఏమయ్యాయి? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మాపై విమర్శలు కాదు, ముందు మిమ్మల్ని మీరు సవరించుకోండి’’ అని అన్నారు.

Updated Date - 2022-03-22T21:26:47+05:30 IST