Rishabh Pant బరువు తగ్గాలి : పాక్ మాజీ క్రికెటర్ కామెంట్.. ఇంకేమన్నాడంటే..
ABN , First Publish Date - 2022-07-21T16:22:49+05:30 IST
ఇంగ్లండ్పై వన్డే సిరీస్(Ind vs Eng) విజయంలో నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant)పై ప్రశంసలజల్లు కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : ఇంగ్లండ్పై వన్డే సిరీస్(Ind vs Eng) విజయంలో నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant)పై ప్రశంసలజల్లు కొనసాగుతోంది. మాజీ క్రికెటర్ల నుంచి నవతరం స్టార్ల దాకా అంతా పంత్ ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్(Shoaib Akhtar) కూడా చేరాడు. పంత్ని ప్రశంసిస్తూ యూట్యూబ్లో ఓ వీడియోను పెట్టాడు.
వీడియోలో ఏమన్నాడంటే.. ‘‘ రిషబ్ పంత్ భయంబెరుకూ లేని క్రికెటర్. ప్రత్యర్థి జట్టుని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు అతడి అమ్ములపొదిలో విభిన్న అస్త్రాలు ఉన్నాయి. కట్ షాట్, పుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, పాడిల్ స్వీప్ ఆడగలడు. ఆస్ట్రేలియాపై(టెస్టు) గెలిపించాడు. ఇప్పుడు ఇక్కడ (ఇంగ్లాండ్పై) గెలిపించాడు. ఒంటిచేత్తో భారత్కు సిరీస్ అందించాడు. అయితే పంత్ ఫిట్నెట్పై దృష్టిసారించాలి. బరువు తగ్గాలి. బరువు తగ్గగలిగితే ఈ యంగ్స్టార్ మోడల్గా మారొచ్చు. కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు.’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు.
‘‘ పంత్ కొంచెం బరువుంటాడు. ఈ విషయంపై అతడు శ్రద్ధపెట్టాలి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ చాలా పెద్దది. పంత్ చూడడానికి చాలా చక్కగా కనిపిస్తాడు. అతడు మోడల్గా మారొచ్చు. కోట్లు సంపాదించొచ్చు. ఎందుకంటే భారత్లో ఒక వ్యక్తి సూపర్స్టార్గా మారితే అతడిపై చాలా పెట్టుబడి పెడతారు ’’ అని అక్తర్ చెప్పాడు. కాగా ఇటివల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. 2-1 తేడాతో సిరీస్ను దక్కించుకుంది. ఇంగ్లండ్పై మూడో వన్డేలో 125 పరుగుల అజేయ సెంచరీ కొట్టాడు. 260 పరుగుల లక్ష్య చేధనలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుని పంత్ గట్టెక్కించాడు. ఇక టీ20 సిరీస్ను కూడా భారత జట్టే గెలుచుకుంది. ఇక టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసుకోగలిగింది. కాగా త్వరలోనే వెస్టిండీస్ సిరీస్ మొదలవనుంది. 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. జులై 27 నుంచి ఈ సిరీస్ మొదలవనుంది.