వైభవంగా దుర్గామాత ప్రతిమల శోభాయాత్ర
ABN , First Publish Date - 2021-10-17T06:16:15+05:30 IST
జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్స వాలు ముగియడంతో అమ్మవార్ల ప్రతిమలను భక్తులు నిమజ్జనానికి తరలించారు. ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగిశాయి. గత పది రోజులపాటు అంగరంగ
జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
నిజామాబాద్ కల్చరల్, అక్టోబరు16: జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్స వాలు ముగియడంతో అమ్మవార్ల ప్రతిమలను భక్తులు నిమజ్జనానికి తరలించారు. ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో ముగిశాయి. గత పది రోజులపాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న దేవీమాత శనివారం నిమజ్జనానికి తరలివెళ్లాయి. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన దేవీమాత ఉత్సవాలు శుక్రవారం వరకు వైభవంగా జరిగాయి. అమ్మవార్లకు యధాశక్తిగా ఉత్తర పూజలు జరిపారు. ఏటికేడు అమ్మవారి మండపాలు పెరుగుతూ ఉండడంతో పాటు వేడుకల్లో అంతకంతకు సెట్టింగ్లతో పూజలు నిర్వహించారు. అమ్మవారిని తరలించడానికి ముందు వివిధ రూపాల్లో అమ్మవారికి కట్టిన చీరలను చేతిలో పెట్టిన లడ్డూలను వేలం వేశారు. అమ్మవారు రోజుకొక రూపంలో భక్తుల పూజలు అందుకుంది. భక్తులు కుంకుమపూజలు, అర్చనలు, గోపజలు, అక్షరాభ్యాసాలు, హోమాలు, అన్నదానములు నిర్వహించారు. ఈ యేడు దేవిమాత మండలి నిర్వహకులు చిత్రపటాలతో పల్లకి సేవను నిర్వహించ డం ప్రత్యేకత చాటుకుంది. రకరకాల ప్రసాదాలను నైవేద్యం సమర్పించుకున్నారు. దేవీమాత శోభయాత్ర జరిగిన దారిపొడవున భక్తులు మంగళహారతులను, కొబ్బరి కాయలను, నైవేద్యాలను సమర్పించుకున్నారు. అమ్మవారి ముందు భవాని భక్తులు, సాధరణ భక్తులు నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందారు. బాణ సంచాలను కల్చుతు, కాశాయ జెండాలను పట్టుకొని ర్యాలీగా అమ్మవారికి స్వాగతం పలికారు. పలు దేవీమాత మం డళ్ల నిర్వాహకులు అమ్మవారికి ప్రసాదం దారిపొడవున భక్తులకు పంపిణీ చేశారు. జై భోలో జగదంబే, దేవీమాతకు జై.. జైజై మాత.. అని నినదిస్తూ భక్తులు అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు. అర్థరాత్రి వరకు సాగిన ఊరేగింపు.. ఆ తర్వాత విగ్రహాలను బాసరకు తరలించారు. విగ్రహాలను మధ్యాహ్నం నుంచే భారీ సంఖ్యలో బాసరకు తరలించారు.
డిచ్పల్లి: మండలంలోని మెంట్రాజ్పల్లిలో శనివారం సాయంత్రం జరి గిన దుర్గామాత నిమజ్జన ర్యాలీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యా రు. గ్రామస్థులు సమష్టిగా ఉండాలని, దుర్గామాత వేడుకల్లో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కవిత అన్నారు.
బోధన్ రూరల్: బోధన్లో ఏకచక్రేశ్వరాలయంలో శనివారం దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించిన అమ్మవారి శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణానికి చెందిన వారే కాకుండా ఇతర గ్రామాల యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, సురేష్ ఆత్మారాం మహరాజ్ శోభాయాత్రను ప్రారంభించారు.
ఇందల్వాయి: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న దుర్గాదేవిని శనివారం మండలంలోని చంద్రాయన్పల్లి, తిర్మన్పల్లి గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు. .
రుద్రూరు: మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో శనివారం దుర్గామాత మండపం వద్ద సర్పంచ్ కోర్వ భాగ్య భూషణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదానంతో పాటు దుర్గాదేవి శోభాయాత్ర నిర్వహించారు.
వేల్పూర్: మండలంలోని పలు గ్రామాల్లో కొలువుదీరిన దుర్గాదేవిలను శనివారం నిమజ్జనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని దుర్గాదేవిలను విగ్రహాలను అందంగా అలంకరించిన ట్రాక్టర్లపై ఉంచి గ్రామవీదుల్లో శోభయాత్రగా నిర్వహించారు.
జక్రాన్పల్లి: మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం దుర్గాదేవి నిమజ్జన శోభయాత్రను దుర్గాదేవి మండపం సభ్యులు జరుపుకున్నారు.
నవీపేట: దుర్గామాత శోభాయాత్రను శనివారం ఘనంగా నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 10వ రోజైన శనివారం మండలంలోని పలు గ్రామాలలో దుర్గామాతలను ప్రత్యేక రథంలో ఉంచి శోభాయాత్రను నిర్వహించారు. నవీపేటలోని జై భవానీ, దర్యాపూర్ మహలక్ష్మి మందిరం, నవీపేట మహలక్ష్మి మందిరంలో కొలువైన దుర్గామాతలకు ప్రత్యేక రథంలో ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. అలాగే, రెంజల్ మండలంతో పాటు కోటగిరి మండలాల్లో దేవి ప్రతిమల శోభాయా త్రల కన్నుల పండువగా సాగింది.
ముప్కాల్: దుర్గామాత నిమజ్జనోత్సవం మండలంలోని కొత్తపల్లి, ముప్కాల్, నాగంపేట్, వెంచిర్యాల్, రెంజర్ల, వేంపల్లి, నల్లూర్ గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల చెరువులో నిమజ్జనం చేశారు.
బాల్కొండ: దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిష్ఠించిన దుర్గాదేవి శోభయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. మండలంలో శుక్ర, శనివారాల్లో అమ్మవారిని భక్తులు, స్వాముల మాలధారణ స్వాముల భజనలతో దుర్గాదేవి శోభయాత్ర నిర్వహించారు.