Love Marriage.. పేరు మార్చుకున్న యువతి.. ఆఖరికి కన్నతల్లి ఇంట్లోనే చోరీ.. కొద్దిసేపటికే..!

ABN , First Publish Date - 2021-11-08T16:53:21+05:30 IST

కన్నతల్లి ఇంట్లో ఓ కుమార్తె చోరీకి పాల్పడింది...

Love Marriage.. పేరు మార్చుకున్న యువతి.. ఆఖరికి కన్నతల్లి ఇంట్లోనే చోరీ.. కొద్దిసేపటికే..!

హైదరాబాద్ సిటీ/బౌద్ధనగర్‌ : కన్నతల్లి ఇంట్లో ఓ కుమార్తె చోరీకి పాల్పడింది. ఇంటి తాళాలు పగలగొట్టి 10తులాల బంగారం, 70 తులాల వెండి ఆభరణాలను తస్కరించింది. గంటల వ్యవధిలోనే చిలకలగూడ పోలీసులు కేసును ఛేదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. బౌద్ధనగర్‌లో నివసించే రాణికి ఐదుగురు కుమార్తెలు. మొదటి కుమార్తె మేరీ(37) ప్రేమ వివాహం చేసుకుని మోహర్‌బేగం, ఆలియాస్‌ షేక్‌ షాదుల్లాగా పేరు మార్చుకుంది. రాణి మిగతా నలుగురు కుమార్తెలను తీసుకుని ఈనెల 3వ తేదీన గోవాకు వెళ్లింది. ఇంటి తాళం పక్కన నివసించే బార్లా శ్రీకాంత్‌కు ఇచ్చింది. 4వ తేదీ సాయంత్రం 8గంటల సమయంలో ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌కు రాణి ఇంటి తలుపులు పగులగొట్టి కనిపించాయి. వెంటనే అతను చిలకలగూడ పోలీసులకు సమాచారమందించారు.


సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దొంగతనం చేసింది రాణి మొదటి కుమార్తె మెహర్‌బేగం ఆలియాస్‌ మేరీగా పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా రాంనగర్‌కు చెందిన ఇబ్రహీముద్దీన్‌ ఫరోకి అలియాస్‌ ఇబ్రహీం(37) సహాయంతో బంగారు, వెండి నగలు దొంగిలించానని నిందితురాలు అంగీకరించింది. ఆమెతోపాటు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 10 తులాల బంగారం నగలు, 70తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం జరిగిన కొద్దిసేపటిలోనే కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌, డీఎస్ఐ సాయికృష్ణ, కానిస్టేబుల్స్‌ను డీసీపీ కల్మేశ్వర్‌, గోపాలపురం డివిజన్‌ ఏసీపీ ఎన్‌.సుధీర్‌లు అభినందించారు.

Updated Date - 2021-11-08T16:53:21+05:30 IST