Shocking : సెకన్ల వ్యవధిలో ఘోరం జరిగిపోయింది..!
ABN , First Publish Date - 2022-05-29T17:21:17+05:30 IST
సెకన్ల వ్యవధిలో ఘోరం జరిగిపోయింది..!
- ప్రాణం తీసిన కారు డోరు
- అప్పా రేడియల్ రోడ్డులో ఘటన
హైదరాబాద్ సిటీ/నార్సింగ్ : ముందుగా వెళ్తున్న కారు డ్రైవర్ (Car) అకస్మాత్తుగా డోరు (Door) తెరవడంతో వెనుకనుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు (Bike) ఆ డోరుకు ఢీకొని ఎగిరి పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) అతనిపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అప్పారేడియల్ రోడ్డులో జరిగింది. నార్సింగ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడాలో నివాసించే వీరస్వామి(45) మేస్ర్తీ పనులు చేస్తుంటాడు. శనివారం పల్సర్ బైక్ పై అప్పా రేడియల్ రోడ్డులో అజీజ్నగర్కు వెళ్తుండగా ముందున్న ఓ కారు డ్రైవర్ ఉమ్మివేయడానికి సడన్గా డోరు తెరిచారు. వేగంగా వస్తున్న బైక్.. కారు పక్కనే ఉండడంతో డోరు తగిలి వీరస్వామి ఎగిరి డివైడర్ అవతలి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరస్వామి పై నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.