లండన్ నుంచి వచ్చిన కొడుకు.. తల్లికి కంటిచూపు పోయిందని ఆస్పత్రికి తీసుకెళ్తే బయటపడ్డ మిస్టరీ..
ABN , First Publish Date - 2022-03-03T17:18:59+05:30 IST
ఓ వృద్ధురాలి కంటి చూపు పోగొట్టడానికి కుట్ర పన్నింది ఆమె కేర్ టేకర్.
బంగారం కాజేయడానికి కళ్లపై విష ప్రయోగం
నాచారంలో వృద్ధురాలిపై కేర్టేకర్ ఘాతుకం
కంటి చూపు కోల్పోయిన వృద్ధురాలు
నాచారం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఓ వృద్ధురాలి కంటి చూపు పోగొట్టడానికి కుట్ర పన్నింది ఆమె కేర్ టేకర్. వృద్ధురాలిని అంధురాలిగా చేస్తే ఆమె ఇంట్లోని డబ్బు, నగలు కొట్టేయవచ్చని ప్రణాళిక వేసుకుంది. అందుకోసం హార్పిక్, జండూబామ్ కలిపిన ద్రావణాన్ని ప్రతిరోజు చుక్కల మందు పేరుతో ఆ వృద్ధురాలి కళ్లలో వేసింది. కొన్ని రోజులకు ఆ వృద్ధురాలు కంటి చూపు కోల్పోయింది. దీంతో వృద్ధురాలి ఇంట్లోని డబ్బు, నగలను ఆ కేర్ టేకర్ తీసుకుంది. తాజాగా, ఆ వృద్ధురాలి కుమారుడు విదేశాల నుంచి వచ్చాడు. తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె కంట్లో విష ప్రయోగం జరిగిందని వైద్యులు చెప్పడంతో కేర్ టేకర్ నిర్వాకం బయటపడింది. కేర్ టేకర్ను అరెస్టు చేసిన పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు.
నాచారం స్నేహపురి కాలనీలోని శ్రీనిధి అపార్టుమెంట్లో నివసించే ఎస్. హైమావతి(73)అనే వృద్ధురాలికి ఆమె కుమారుడు శశిధర్ కేర్ టేకర్గా మంచిర్యాలకు చెందిన పి.భార్గవి (32) అనే మహిళకు పనిలో పెట్టాడు. గత ఏడాది ఆగస్టు నుంచి హైమావతి వద్ద భార్గవి పనిచేస్తోంది. కుమారుడు శశిధర్ లండన్లో ఉంటున్నాడు. కేర్టేకర్గా పనిచేస్తున్న సమయంలో హైమావతి వద్ద ఉన్న డబ్బు, నగలను గమనించిన భార్గవి.. ఎలాగైనా కాజేయాలని పథకం వేసింది. కళ్లు కనబడకుండా చేస్తే సులభంగా నగలు, నగదు చోరీ చేయవచ్చని ఆమె కంటి చూపును లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది. హైమావతి కంట్లో నుంచి నీరు కారుతుండటంతో దీన్ని అవకాశంగా తీసుకున్న భార్గవి, చుక్కల మందు పేరుతో హార్పిక్, జండూబామ్ కలిపిన ద్రావణాన్ని రోజుకు నాలుగు సార్లు ఆమె కళ్లలో వేసేది. దీంతో ఆమె కంటి చూపు పోయింది. ఇదే విషయాన్ని లండన్లో ఉన్న ఆమె కుమరుడు శశిధర్కు చెప్పింది. అతడిచ్చిన సమాచారంతో వచ్చిన పోలీసులు భార్గవిని అదుపులో తీసుకున్నారు. ఆమె బ్యాగులో హార్పిక్, జండూబామ్లతోపాటు బంగారు గాజులు, పచ్చల హారం పోలీసులకు లభ్యమయ్యాయి.