నన్ను కాల్చండి.. జైలుకు పంపండి
ABN , First Publish Date - 2022-04-06T08:47:30+05:30 IST
‘‘నా ఆస్తులు జప్తు చేయండి. నన్ను కాల్చండి. జైలుకు పంపండి. అయి నా భయపడేది లేదు. నేను బాలాసాహెబ్ థాకరే అనుచరుడిని.
నా ఆస్తులను జప్తు చేసినా భయపడను బీజేపీ నన్ను టార్గెట్ చేసింది
ఈడీ దాడులపై సంజయ్ రౌత్రూ.1,034 కోట్ల భూ కుంభకోణం
ఇది కక్షసాధింపే: ‘మహా’కూటమి
నన్ను కాల్చండి.. జైలుకు పంపండి
భయపడేది లేదు.. బీజేపీ టార్గెట్ చేసింది
ఈడీ దాడులపై సంజయ్ రౌత్
ముంబై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ‘‘నా ఆస్తులు జప్తు చేయండి. నన్ను కాల్చండి. జైలుకు పంపండి. అయి నా భయపడేది లేదు. నేను బాలాసాహెబ్ థాకరే అనుచరుడిని. నిజమైన శివసైనికుడిని. పోరాడతాను. ప్రతి ఒక్కరి వ్యవహారం బయట పెడతాను. వాళ్లను డ్యాన్స్ చేయనివ్వండి. నేను చూస్తూ కూర్చునే రకం కాదు. చివరికి నిజమే గెలుస్తుంది’’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సంజయ్ రౌత్, ఆయన కుటుంబంతో పాటు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన కుటుంబ కంపెనీ, శారదా చిట్ఫండ్ కంపెనీలపై దాడులు జరిపి పెద్ద మొత్తంలో ఆస్తులను జప్తు చేసింది.
ముంబైలోని అలీబాగ్లో సంజయ్ రౌత్, ఆయన కుటుంబానికి చెందిన 8 ప్లాట్లు, దాదర్ సబర్బన్లోని ఫ్లాట్ను ఈడీ అటాచ్ చేసింది. రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఈ ఆస్తులను జప్తు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ అధికారులపై ఆరోపణల దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయగానే రౌత్ ఆస్తుల జప్తు జరగడం విశేషం.
మహారాష్ట్ర సర్కారును కూల్చేందుకు సహకరించనందుకే..
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి వేసే ప్రయత్నాలకు సహకరించనందుకే తనను బీజేపీ టార్గెట్ చేసిందని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షేనని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం లేదని ఆరోపించారు. హోం మంత్రి దిలీప్ పాటిల్ కూడా ఈడీ చర్యలను తప్పుబట్టారు.
రౌత్పై ఒత్తిడి పెంచేందుకు జరుగుతున్న కుట్రగా ఎస్సీపీ నేత, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ అభివర్ణించారు. మరోవైపు, కొందరు ఈడీ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న సంజయ్ రౌత్ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు మహారాష్ట్ర సర్కారు సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన కుటుంబ కంపెనీకి చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. బెంగాల్లో 2013 నాటి శారదా చిట్ఫండ్ మనీలాండరింగ్ కేసులో కూడా ఈడీ రూ.35 కోట్ల ఆస్తులను మంగళవారం స్వాధీనం చేసుకుంది.
కాగా, నాగపూర్కు చెందిన న్యాయవాది సతీశ్ ఉకె, ఆయన సోదరుడిని ఈడీ అరెస్టు చేసింది. వారికి ఈ నెల 6 వరకు ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించింది. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీ్సపై కొన్నేళ్లుగా ఎన్నో ఫిర్యాదులు చేసిన వ్యక్తిగా లాయర్ సతీశ్ గుర్తింపు పొందారు.