రాజన్న సన్నిధిలో శ్రావణ రద్దీ
ABN , First Publish Date - 2022-08-13T06:21:26+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది.
వేములవాడ, ఆగస్టు 12: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో రద్దీగా మారింది. శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని, రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో భక్తులు కుంకుమపూజలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరస్వామివారి అనుబంధ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆఽధ్వర్యంలో సాయంత్రం ఛాయనక్త సమయమున షోడషోపచార పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి పసుపు, కుంకుమలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఆలయ ఆవరణలో తులసీమాతకు పూజలు నిర్వహించారు రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం, సాయంత్రం రాజరాజేశ్వరి అమ్మవారికి చతుష్షష్టి ఉపచారములతో విశేష పూజలు చేశారు.