మధుమేహ బాధితులకు ప్రాధాన్యం...
ABN , First Publish Date - 2021-06-13T16:59:56+05:30 IST
కరోనా టీకాల పంపిణీలో మధుమేహ, రక్తపోటు బాధితులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెన్నై కార్పొరేషన్ నిర్ణయించింది. నగరంలో వున్న బాధితుల వివరాలు సేకరించి, వారికి కరోనా టీకా అం
- చెన్నై కార్పొరేషన్ నిర్ణయం
అడయార్(చెన్నై): కరోనా టీకాల పంపిణీలో మధుమేహ, రక్తపోటు బాధితులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెన్నై కార్పొరేషన్ నిర్ణయించింది. నగరంలో వున్న బాధితుల వివరాలు సేకరించి, వారికి కరోనా టీకా అందుబాటులో వుండేలా చర్యలు చేపట్టాలని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్దీప్సింగ్ బేడీ సారథ్యంలోని ఉన్నతస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్ణయించింది. నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కరోనా రహితనగరంగా చేసేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై చెన్నై నగర పాలక సంస్థ కమిషనరు గగన్దీప్ సింగ్ బేడీ సారథ్యంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. స్థానిక రిప్పన్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి నగర పాలక సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు హాజరయ్యారు. నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ రోజువారీగా జరుపుతున్న ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించరాదని నిర్ణయించారు. నగర వ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల ద్వారా పరీక్షలు నిర్వహిస్తూనే ఉండాలని సూచించారు. అలాగే, కూరగాయలు, మాంసం విక్రయ మార్కెట్ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సమాచార కేంద్రాలు, ఐటీ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేస్తుండాలని నిర్ణయించారు. ముఖ్యంగా కార్పొరేషన్ హెల్త్ సిబ్బందితో అధిక రక్తపోటుతో పాటు మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలు సేకరించి, కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నారా? లేదా? నిర్థారించుకుని, వ్యాక్సిన్ వేయించుకోని వారికి ప్రత్యేక ఏర్పాట్ల మధ్య వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.