Siddaramaiah: బెంగళూరులో పాఠ్య పుస్తకాలపై ముదురుతున్న వివాదం.. రోడ్లెక్కుతామని సిద్ధరామయ్య వార్నింగ్

ABN , First Publish Date - 2022-06-10T02:00:22+05:30 IST

కర్ణాటకలో ముద్రితమైన పాఠ్య పుస్తకాలను ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీధుల్లో నిరసనలకు దిగుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య..

Siddaramaiah: బెంగళూరులో పాఠ్య పుస్తకాలపై ముదురుతున్న వివాదం.. రోడ్లెక్కుతామని సిద్ధరామయ్య వార్నింగ్

బెంగళూరు: కర్ణాటకలో ముద్రితమైన పాఠ్య పుస్తకాలను ఉపసంహరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీధుల్లో నిరసనలకు దిగుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కర్ణాటక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొత్తగా ముద్రితమైన పాఠ్య పుస్తకాల్లోని అంశాలు కన్నడిగుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, ఈ పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్కూల్ టెక్ట్స్ బుక్స్‌లో సవరణలు చేసిన Textbook Revision Committeeకి నాయకత్వం వహించిన రోహిత్ చక్రతీర్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు వీర విధేయుడని.. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సవరణలను వెనక్కి తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వీధుల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని సిద్ధరామయ్య గురువారం బెంగళూరులో మాట్లాడుతూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. అధికార పక్షం మాత్రం రాష్ట్రంలో ఇప్పటికే ముద్రితమైన పాఠ్యపుస్తకాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని తెగేసి చెబుతోంది.



ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలోని పాఠ్యాంశాలు, తమ ప్రభుత్వ హయాంలోని పాఠ్యాంశాలను సరి పోల్చుకునే అవకాశాన్ని ప్రజలకే వదిలివేస్తున్నామన్నారు. పాఠ్యాంశాల విషయంలో కాంగ్రెస్‌ అనవసర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఒకవేళ సబ్జెక్టుల్లో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. వివాదం పులుముకున్న పాఠ్యాంశాలను వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజాభిప్రాయం కోరతామని తెలిపారు. 9వ తరగతి సోషియల్‌ సైన్స్‌ పుస్తకంలో రాజ్యాంగ నిర్మాత అనే పదం పొరపాటున వదిలేశారని, దీన్ని మళ్లీ చేరుస్తున్నామన్నారు. అలాగే బసవణ్ణకు సంబంధించిన రెండు వాక్యాలను తిరిగి చేరుస్తున్నామని వివరించారు. ఇవి మినహా మిగిలిన పాఠాలలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు.



ఒకవేళ ప్రజలనుంచి సూచనలు వస్తే రోహిత్‌ చక్రతీర్థ కమిటీ తొలగించిన పాఠ్యాంశాలను మళ్లీ చేర్చేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందన్నారు. చిన్నారుల మనసులను కలుషితం చేసేలా బీజేపీ పాఠ్యపుస్తకాల సవరణ పేరిట సాంస్కృతిక అత్యాచారం చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మండిపడ్డారు. చక్రతీర్థ కమిటీ బీజేపీ సిద్ధాంతపరమైన పాఠాలను పాఠ్యాంశాలుగా చేర్చిందన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 9న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విధానసౌధ వద్ద గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన చేపడతారన్నారు. పాఠ్యపుస్తకాలపై కాంగ్రెస్‌ అభ్యంతరాలతోపాటు పలు మఠాలు, దళిత సం ఘా లు కూడా ఆక్రోశం వ్యక్తం చేస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు.

Updated Date - 2022-06-10T02:00:22+05:30 IST