సిద్దరామయ్యతో జేడీఎస్ Mla పుట్ట రాజు భేటీ
ABN , First Publish Date - 2022-01-29T13:44:22+05:30 IST
జేడీఎస్ పార్టీ సీనియర్నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీఎస్ పుట్టరాజు రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్యను కలిశారు. గురువారం రాత్రి బెంగళూరులోని సిద్దరామయ్య నివాసంలో వారు భేటీ అయ్యారు. సుదీర్ఘ సమయం వా
- రాజకీయ వర్గాల్లో చర్చ
బెంగళూరు: జేడీఎస్ పార్టీ సీనియర్నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సీఎస్ పుట్టరాజు రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్యను కలిశారు. గురువారం రాత్రి బెంగళూరులోని సిద్దరామయ్య నివాసంలో వారు భేటీ అయ్యారు. సుదీర్ఘ సమయం వారు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్అహ్మద్ వీరి భేటీకి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మండ్య జిల్లాలో జేడీఎస్ పార్టీకి సీనియర్నేతగా పుట్టరాజుకు పేరుంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏడాదిన్నరపాటు మంత్రిగాను వ్యవహరించారు. ఆ తర్వాత కుమారస్వామితో ఏర్పడిన విభేదాల కారణంగా జేడీఎస్ కారక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏడాది కాలంలో ఇటు కుమారస్వామిని కానీ అటు అగ్రనేత దేవేగౌడను కానీ పుట్టరాజు కలువలేదు. మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు వస్తున్నవేళ పుట్టరాజు కలయిక సర్వత్రా చర్చనీయాంశమైంది. పైగా జేడీఎస్ నేత కుమారస్వామి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటుంటారు. ప్రత్యేకించి రెండురోజులుగా సాగుతున్న విమర్శలు తారస్థాయికి చేరాయి. జేడీఎస్ను సిద్దరామయ్య ముగించలేరని కూడా కుమారస్వామి సవాల్ విసిరారు. ఇలాంటి సమయంలోనే పుట్టరాజు నేరుగా సిద్దరామయ్య నివాసానికి వెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమయింది. వీరి భేటీ వేళ ఎమ్మెల్యే జమీర్అహ్మద్తో పాటు కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు ఎంబీ పాటిల్ కూడా ఉన్నట్లు సమాచారం.