రెండు రోజుల్లో సిద్దిపేటలో కొవిడ్ ఆస్పత్రి
ABN , First Publish Date - 2020-07-13T20:28:17+05:30 IST
రెండురోజుల్లో కొవిడ్ చికిత్సకు 100 పడకలు, సంబంధిత పరీక్షలు చేసే పరికరాలు తెప్పించి ఈనెలన 15న ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని జిల్లా
సిద్దిపేట సిటీ (ఆంధ్రజ్యోతి): రెండురోజుల్లో కొవిడ్ చికిత్సకు 100 పడకలు, సంబంధిత పరీక్షలు చేసే పరికరాలు తెప్పించి ఈనెలన 15న ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని జిల్లా ఏరియా ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సకు వందపడకల ఏర్పాట్లు, పనుల పురోగతిపై వార్డుల వారీగా గదులను పరిశీలించారు. ఆస్పత్రి చుట్టూ కలియతిరిగారు. రోగులకు వచ్చిపోయే దారులు, వారి గదులల్లో సౌకర్యాలు తదితర అంశాలపై వైద్యాధికారులతో అక్కడికక్కడే ఆరా తీశారు. కొవిడ్ పరీక్షలు చేసే పరికరాలు ఎన్ని వచ్చాయి. ఇంకా ఎన్నిరావాల్సి ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రావాల్సిన పరికరాలను త్వరగా తెప్పించాలని ఉన్నతాధికారులను ఫోన్లో ఆదేశించారు. ఆస్పత్రి పాత భవనం దృష్ట్యా మరమ్మతుల కోసం యుద్ధప్రాతిపదికన రూ.6.50 లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్కు ఫోన్లో ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చి ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారితో మంత్రి ఫోన్లో మాట్లాడారు. డాక్టర్లు చూస్తున్న తీరుతెన్నలపై అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ‘సుడా’ చైర్మన్ రవీందర్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, సూపరింటెండెంట్ చంద్రయ్య, సివిల్ సర్జన్ ఆర్ఎంవో కాశీనాథ్, కరోనా వంద పడకల ఆస్పత్రి నోడల్ అధికారి శ్రవణ్, మహేశ్, వైద్యఇంజనీర్ విశ్వప్రసాద్, వైద్యాధికారులు, తదితరులు ఉన్నారు.