Congress Crisis: పంజాబ్ సీఎం చన్నీని కలిసిన సిద్ధూ
ABN , First Publish Date - 2021-09-30T22:38:20+05:30 IST
ముఖ్యమంత్రి చన్నీ తన సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. వివాదాస్పద వ్యక్తులను డీజీపీ, ఏజీలుగా నియమించారే కారణంతో తాను రాజీనామా చేసినట్లు సిద్ధూ చెప్పుకొచ్చినప్పటికీ.. దీని వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది..
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని నవజ్యోత్ సింగ్ సిద్ధూ కలుసుకున్నారు. చండీగఢ్లోని పంజాబ్ భవనంలో గురువారం మద్యాహ్నం వీరి కలయిక జరిగింది. ముఖ్యమంత్రి చన్నీ పిలుపు మేరకు తాను చండీగఢ్ వెళ్తున్నానని, మద్యాహ్నం 3 గంటలకు పంజాబ్ భవన్లో తమ సమావేశం ఉందని సిద్ధూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. అయితే సిద్ధూ కాంగ్రెస్లోనే కొనసాగుతారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చన్నీ తన సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. వివాదాస్పద వ్యక్తులను డీజీపీ, ఏజీలుగా నియమించారే కారణంతో తాను రాజీనామా చేసినట్లు సిద్ధూ చెప్పుకొచ్చినప్పటికీ.. దీని వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మూడు రోజులుగా కాంగ్రెస్ నేతలకు దూరంగా ఉంటున్న సిద్ధూ గురువారం ముఖ్యమంత్రి చన్నీని కలవడానికి వెళ్లారు. దీంతో కాంగ్రెస్లో కొంత సానుకూలత ఏర్పడింది. ‘‘సిద్ధూ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. సమస్యలు అన్నీ సద్దుమనుగుతాయి. సిద్ధూ నాయకత్వంలోనే పంజాబ్ ఎన్నికలకు వెళ్తాం’’ అని కాంగ్రెస్ నేత ముస్తఫా అన్నారు.