మత మార్పిడి నిరోధక బిల్లుకు మేం వ్యతిరేకం : సిద్ధరామయ్య

ABN , First Publish Date - 2021-12-17T22:18:09+05:30 IST

మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించేందుకు అవకాశం

మత మార్పిడి నిరోధక బిల్లుకు మేం వ్యతిరేకం : సిద్ధరామయ్య

బెంగళూరు : మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించేందుకు అవకాశం ఇవ్వబోమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం మత మార్పిడి వ్యతిరేక బిల్లును తీసుకొస్తోందని, దీనికి తాము వ్యతిరేకమని తెలిపారు. ప్రతిపాదిత బిల్లు ప్రకారం వ్యక్తులను బలవంతంగా వేరొక మతంలోకి మార్చడం నాన్ బెయిలబుల్ నేరం. ఈ నేరానికి పాల్పడినవారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష, గరిష్ఠంగా రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చు. 


కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021ను త్వరలోనే శాసన సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వ్యక్తులను బలవంతంగా కానీ, ప్రలోభాలకు గురి చేసి కానీ మతం మార్చడం నేరమని ఈ బిల్లు చెప్తోంది. ఈ నేరానికి పాల్పడినవారికి కనీసం మూడేళ్ళ జైలు శిక్ష, కనీసం రూ.25,000 జరిమానా విధించవచ్చునని చెప్తోంది. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన వ్యక్తి ఓ మైనారిటీ మతంలోకి మారితే, అంతవరకు ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని, రిజర్వేషన్లను కోల్పోతారు. అదే సమయంలో కొత్తగా చేరిన మతం ద్వారా లభించే ప్రయోజనాలను పొందుతారు. ఈ నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యతను మతం మార్చిన వ్యక్తికే ఉంటుందని ఈ బిల్లు చెప్తోంది. 


భారత రాజ్యాంగంలోని అధికరణ 25 ప్రకారం మత వ్యాప్తి, ప్రచార హక్కు పరిధిలోకి వేరొక వ్యక్తిని మతం మార్చే హక్కు రాదని సుప్రీంకోర్టు 1977లో తీర్పు చెప్పిందని ఈ బిల్లులో పేర్కొన్నారు. 


ఈ బిల్లును కాంగ్రెస్, జేడీఎస్ వ్యతిరేకిస్తున్నాయి. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ, మత మార్పిడులు  సమాజంలో ఘర్షణలను సృష్టిస్తున్నాయని, దేశ ఐక్యత, సమగ్రతలకు ముప్పు కలిగిస్తున్నాయని చెప్పారు. బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక బిల్లును తాము సమర్థిస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2021-12-17T22:18:09+05:30 IST