సిద్ధూ మూసేవాలా హంతకుల ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2022-07-20T22:24:20+05:30 IST

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఒకరిని పోలీసులు మట్టుబెట్టారు. మృతుడిని జగ్రూప్ సింగ్ రూపా గా గుర్తించారు.

సిద్ధూ మూసేవాలా హంతకుల ఎన్‌కౌంటర్

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హంతకులను పోలీసులు మట్టుబెట్టారు. మృతులను జగ్రూప్ సింగ్ రూపా (Jagroop Singh Roopa), మన్‌ప్రీత్ సింగ్ గా గుర్తించారు. అమృత్‌సర్‌ సమీపంలోని భక్నా గ్రామంలో నాలుగు గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వార్త కవరేజికి వెళ్లిన వీడియో జర్నలిస్ట్ ఒకరు గాయపడ్డారు. అతడి కుడికాలికి గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులు భక్నా గ్రామంలో అనేక ఇళ్లను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే47, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 





సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇప్పటివరకూ మొత్తం 8 మంది షూటర్లను అరెస్ట్ చేశారు. దీపక్ మండి అనే షూటర్ ఇంకా పరారీలో ఉన్నాడు. 




పంజాబ్‌లోని జవహర్కే అనే గ్రామంలో ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు. రెండు స్కార్పియోలు, ఒక బులేరోలో దాదాపు పది మంది దుండగులు సిద్ధూ మూసేవాలా కారును వెంబడించారు. ఓ కారు వీరిని ఓవర్‌టేక్‌ చేసి.. ముందుకు వెళ్లి నిలిచింది. మూసేవాలా తన వాహనాన్ని నిలిపిన వెంటనే మూడు ఎస్‌యూవీల్లోంచి పిస్టళ్లు, ఏకే-47తో దిగిన దుండగులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సిద్ధూ మూసేవాలాను పొట్టనపెట్టుకున్నారు.  పంజాబ్‌లో 424 మందికి భద్రత ఉపసంహరించిన మర్నాడే ఈ హత్య జరిగింది. ఉలిక్కిపడిన మాన్ ప్రభుత్వం మళ్లీ తిరిగి అందరికీ భద్రతను పునరుద్ధరించింది.



Updated Date - 2022-07-20T22:24:20+05:30 IST