సీఎం పర్యటన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-07-05T10:56:28+05:30 IST

ఇడుపులపాయలో ఈనెల 7, 8వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌

సీఎం పర్యటన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ఇడుపులపాయలో పర్యటించిన కలెక్టర్‌, ఎస్పీ


వేంపల్లె, జూలై 4: ఇడుపులపాయలో ఈనెల 7, 8వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించడం, ట్రిపుల్‌ఐటీలో అభివృద్ధి పనులను ప్రారంభించడం, కొత్త పనులకు శంకుస్థాపన చేసేందుకు సీఎం జిల్లాకు రానున్నారని తెలిపారు. 7వ తేదీ సాయంత్రం ఇడుపులపాయకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ త్వరలోనే విడుదల అవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.


మొదట హెలీప్యాడ్‌ స్థలాన్ని, ఆడిటోరియం, వైఎస్‌ విగ్రహ ఏర్పాటు పనులు, శిలాఫలకాల నిర్మాణం, నిర్మించిన ల్యాబ్‌ కాంప్లెక్స్‌ పనులను ఎస్పీ అన్బురాజన్‌, జేసీ సాయికాంత్‌వర్మ, పులివెందుల ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, అదనపు ఎస్పీ రుషికేశవరెడ్డి, జడ్పీ సీఈవో సుధాకర్‌, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ సుధీర్‌ప్రేమ్‌కుమార్‌, రామచంద్రారెడ్డి, సతీ్‌షచంద్ర పరిశీలించారు.


పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. భద్రత విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, భద్రతా చర్యలకు సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలన చేశారు. సీఎంకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు వస్తే స్వీకరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఉమాసుందరి, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, హార్టికల్చర్‌ డీడీ వజ్రశ్రీ, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T10:56:28+05:30 IST