ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు ఉరిశిక్షే సరి అన్న Singapore Court.. ఇంతకు వారు చేసిన నేరమేంటంటే!

ABN , First Publish Date - 2021-11-27T17:11:35+05:30 IST

మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో దోషులుగా తేలిన ఇద్దరు భారత సంతతి వ్యక్తుల మరణశిక్షను సింగపూర్ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు ఉరిశిక్షే సరి అన్న Singapore Court.. ఇంతకు వారు చేసిన నేరమేంటంటే!

సింగపూర్ సిటీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో దోషులుగా తేలిన ఇద్దరు భారత సంతతి వ్యక్తుల మరణశిక్షను సింగపూర్ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. మార్చి 2016లో సుమారు 1.34 కిలోల గంజాయి రవాణాకు కుట్రపన్నినందుకు మలేషియాకు చెందిన కమలనాథన్ మునియాండీ(27), సింగపూర్‌కు చెందిన చంద్రు సుబ్రమణ్యం(52) దోషులుగా తేలడంతో వారికి ఉరిశిక్ష విధించింది. అయితే, తాము ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకోలేదని, మాదకద్రవ్యాల గురించి తమకు అసలేం తెలియదని వారిద్దరూ ఖండించారు. ఇక ఇదే కేసులో దోషిగా ఉన్న మరో భారత సంతతి వ్యక్తి ప్రవీనాష్ చంద్రన్‌కు న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు 15 కొరడా దెబ్బల శిక్ష విధించింది. దాంతో తాను నిర్ధోషినని తనకు ఏ పాపం తెలియదంటూ ప్రవీనాష్ శుక్రవారం న్యాయస్థానంలో అప్పీల్ వేశాడు. కానీ, అతడి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగానే కమలనాథన్, చంద్రులకు విధించిన మరణశిక్షను కూడా న్యాయస్థానం సమర్థించింది. ఈ ముగ్గురు నేరం చేసినట్లు రుజువైనందున వారికి విధించిన శిక్షలు సరియైనవేనని కోర్టు చెప్పుకొచ్చింది. 


అసలేం జరిగిందంటే.. 2016 మార్చి 5వ తేదీన ప్రవీనాష్, కమల్‌నాథన్ వూడ్‌ల్యాండ్స్ చెక్‌పాయింట్ ద్వారా సింగపూర్ వచ్చారు. అనంతరం వారిద్దరూ మరో వ్యక్తి సురేన్‌ను కలిసేందుకు క్రాంజి ఎంఆర్‌టీ రైల్వే స్టేషన్ వెళ్లారు. వారిద్దరూ అక్కడి ఓ కాఫీ షాపులో కూర్చుని ఉండగా సురేన్ వచ్చాడు. ఆ సమయంలో ప్రవీనాష్ వద్ద ఉన్న చిన్న సంచిలో డ్రగ్స్ ఉన్న డ్రగ్స్‌ను అతడికి చూపించారు. ఆ తర్వాత వారు ముగ్గురు అక్కడి నుంచి క్రాంజి రోడ్‌కు వెళ్లి చంద్రును కాంటాక్ట్ చేశారు. దాంతో చంద్రు అక్కడికి కొంత నగదు, ఖాళీ ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకుని వచ్చాడు. నలుగురు కలిసి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం చర్చించుకుంటున్న సమయంలో సెంట్రల్ నార్కోటిక్ బ్యూరో(సీఎన్‌బీ) అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ప్రవీనాష్ వద్ద ఉన్న బ్యాగులో సీఎన్‌బీకి 1.34 కిలోల గంజాయి దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సింగపూర్ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. దీంతో ముగ్గురు భారత సంతతి వ్యక్తులను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. కమలనాథన్, చంద్రుకు ఉరిశిక్ష.. ప్రవీనాష్‌కు జీవిత ఖైదుతో పాటు 15 కొరడా దెబ్బల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, తాజాగా తనకు విధించిన శిక్షపై ప్రవీనాష్ అప్పీల్ చేశాడు. దాంతో అతని అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు వీరికి విధించిన శిక్షలను సమర్థించింది.         

Updated Date - 2021-11-27T17:11:35+05:30 IST