రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’

ABN , First Publish Date - 2022-08-05T00:56:51+05:30 IST

సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, కార్యవర్గ సభ్యులందరూ కలిసి "మా రెండేళ్ల ప్రయాణం" అనే కార్యక్రమం నిర్వహించారు.

రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’

సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, కార్యవర్గ సభ్యులందరూ కలిసి "మా రెండేళ్ల ప్రయాణం" అనే కార్యక్రమం నిర్వహించారు. సింగపూర్ తెలుగు సౌరభాలను విశ్వవ్యాప్తంగా విరజల్లుతూ, సంస్థ స్థాపించిన మొదటి రోజు నుండీ సింగపూర్‌లో నిక్షిప్తమైన తెలుగు సాహితీ సంపదను, కళాకారులను, సాహితీ వేత్తలనూ వెలుగులోకి తెస్తూ, ఎందరో తెలుగు ప్రముఖుల ప్రశంసలు పొందిన సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారధి".


సాంకేతికపథంలో నడుస్తూ ప్రాచీన తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మిక, కళారంగాలకు చెందిన విన్నూత్న కార్యక్రమాలను ప్రపంచ నలుమూలలకూ చేరేలా నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. సింగపూర్‌లో 'తెలుగు' అనగానే ప్రపంచం మొత్తం తలచుకునే పేరు 'శ్రీ సాంస్కృతిక కళాసారధి'. అతి స్వల్పకాలంలోనే అంతటి స్థానం సంపాదించిందంటే దానివెనుక ఎంత నిబద్ధత, ఎంత కృషి ఉందో అందరూ తెలుసుకునేలా సంస్థ ప్రధాన కార్యవర్గ సభ్యుల అంతరంగాలను ఆవిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


సంస్థ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యవర్గ సభ్యులు రాధిక మంగిపూడి, ఊలపల్లి భాస్కర్, చామిరాజు రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమాలను నిర్వహించడం వెనుక తమ కృషి, ఎదుర్కొన్న సవాళ్లు, రూపకల్పన విధానం, సాంకేతిక ఇబ్బందులు గురించిన ఎన్నో విషయాలను అందరితో పంచుకున్నారు.  తమ రెండేళ్ల ప్రస్థానంలో సంస్థను కలుపుకొని ప్రోత్సహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, తానా, మలేషియా తెలుగు సంఘం, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన ప్రపంచవ్యాప్త సంస్థలకు, వారి నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


వైవిధ్యభరితమైన ప్రతిష్టాత్మక కార్యక్రమాల నుండి 24 గంటల నిర్విరామ అంతర్జాల కార్యక్రమాల వరకు సాగిన ప్రయాణంలో తెరవెనుక ఆసక్తికరమైన కబుర్లు పంచుకుంటూ, తమ కార్యక్రమాలను ఆశీర్వదించిన పీఠాధిపతులు, లబ్ధ ప్రతిష్టులైన ప్రముఖుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమన్వయకర్తగా సుబ్బు వి పాలకుర్తి వ్యవహరించగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని సాంకేతిక నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారమైంది. ఈ కార్యక్రమాన్ని ఈ యూట్యూబ్ ఈ లింక్   https://youtube.com/embed/XnFc7-wo7IA ద్వారా మళ్లీ వీక్షించవచ్చు. 



Updated Date - 2022-08-05T00:56:51+05:30 IST